Alt News Co founder Case: యూపీలో నమోదైన అన్ని కేసుల్లోనూ జుబెయిర్కు ఊరట
ABN , First Publish Date - 2022-07-20T23:55:52+05:30 IST
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబెయిర్ (Mohammed
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబెయిర్ (Mohammed Zubair)పై ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయనకు ఊరట లభించింది. ఆయనను కస్టడీలో కొనసాగించడం సమర్థనీయం కాదని చెప్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఆయనకు బెయిలు మంజూరు చేసింది. ఆయనను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఆయన ఇకపై ట్వీట్లు చేయడం కొనసాగించవచ్చునని తెలిపింది.
ఓ హిందూ దేవతకు వ్యతిరేకంగా జుబెయిర్ ఇచ్చిన ట్వీట్పై నమోదైన కేసును ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ దర్యాప్తు చేస్తోంది. కాబట్టి ఆయనపై నమోదైన అన్ని కేసుల దర్యాప్తును అక్కడికే బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్న ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
ట్వీట్లు ఇవ్వకుండా జుబెయిర్ను నిరోధించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ విధంగా కోరడం ఓ న్యాయవాదిని వాదించవద్దని కోరడం, ఓ వ్యక్తిని మాట్లాడవద్దని కోరడం వంటిదని పేర్కొంది. ఆయన ఏం చేసినా చట్ట ప్రకారం బాధ్యుడవుతారని తెలిపింది. ఓ పాత్రికేయుడిని రాయవద్దని కోరలేమని తెలిపింది. ఒకే చోట దర్యాప్తు జరగడం అవసరమని చెప్తూ ఉత్తర ప్రదేశ్లో నమోదైన కేసులన్నిటినీ ఢిల్లీకి బదిలీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఆయనపై నమోదైన కేసులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆయనపై భవిష్యత్తులో నమోదు కాబోయే కేసులపై కూడా ఢిల్లీలోనే విచారణ జరగాలని తెలిపింది.
ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమక్షంలో రూ.20,000 పూచీకత్తు చెల్లించాలని జుబెయిర్ను ఆదేశించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును నిలిపేయాలని ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్ల రద్దుకోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని జుబెయిర్కు తెలిపింది.
2018లో జుబెయిర్ ఇచ్చిన ట్వీట్ హిందువుల మనోభావాలను గాయపరుస్తోందని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన కేసులో ఆయనకు ఇటీవల ఢిల్లీ కోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.