షుగర్‌కు సరైన మందు!

ABN , First Publish Date - 2021-12-28T05:30:00+05:30 IST

పాత సంవత్సరం పోయి కొత్త ఏడాది వస్తోంది. కానీ కాలంతో సంబంధం లేకుండా మధుమేహం మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ వ్యాధి అధికంగా పెరుగుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌లో...

షుగర్‌కు సరైన మందు!

పాత సంవత్సరం పోయి కొత్త ఏడాది వస్తోంది. కానీ కాలంతో సంబంధం లేకుండా మధుమేహం మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ వ్యాధి అధికంగా పెరుగుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌లో... దీని నియంత్రణకు ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ఆశ్రయించేవారు చాలా తక్కువ. అయితే ఆయుర్వేదంలో మధుమేహాన్ని అదుపులో ఉంచే సమర్థవంతమైన చికిత్సలున్నాయి. అవేంటో చూద్దాం... 


విధానం

భారతీయులకు వేదకాలం నుంచి మధుమేహం గురించి తెలుసు. అప్పట్లో మధుమేహాన్ని అస్రవ అనేవారు. ఇది ప్రపంచవ్యాప్త ప్రజలను పీడిస్తున్న సమస్య. చికిత్స కంటే ముందు, వ్యాధి దరిచేరకుండా చూసుకోవడం ముఖ్యం. 


ప్రమేహం (మధుమేహం)కు ప్రధాన కారణాలు

శరీర కదలికలు తగ్గిన జీవనశైలి, వ్యాయామ లోపం. దివాస్వప్నం (పగటి వేళ నిద్ర), అస్తవ్యస్త ఆహారపు అలవాట్లు, శీతలం (చల్లని), స్నిగ్ధ (నూనెతో కూడిన), గురు (భారీ), అభిష్యంధి (శక్తి మార్గాలను అడ్డుకొనేది) వల్ల మధుమేహం వస్తుంది. 


పాలతో తయారయ్యే పదార్థాలు, బెల్లం, పెరుగు, బేకరీ, పులిసిపోయిన పదార్థాలు, శీతల పానీయాలు తినడం లేదా తాగడం వల్ల మధుమేహం వస్తుంది. 


మూడు మార్గాల్లో చికిత్స... 

సాధారణంగా మధుమేహంతో బాధపడేవాళ్లు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే వరకూ వైద్యులను సంప్రతించరు. నీరసం, విపరీతమైన దాహం, అతిమూత్రం వంటి లక్షణాలు కనిపించే వరకూ పట్టించుకోరు. ఆయేర్వేదంలో వ్యక్తి శరీర తత్వం ఆధారంగానే చికిత్స ఉంటుంది. దోషాల్లో అవకతవకల కారణంగా మధుమేహానికి గురైన స్థూలకాయులకు పంచకర్మలో భాగమైన ‘శోధన చికిత్స’ (శరీర శుద్ధి) చేయవలసి ఉంటుంది. ఇందుకు కఫ దోషానికి చెందిన వారికి ‘వమనం’ (వాంతులు చేయించడం ద్వారా శరీరంలోని విషాలు బయటకు వెళ్లగొట్టడం), పిత్తజ దోషానికి చెందివారికి వేరేచనాలు అయ్యేలా చేయడం లాంటి చికిత్సలు అవసరమవుతాయి. శోధన చికిత్స తర్వాత శమన చికిత్స (తోడ్పాటుతో కూడిన చికిత్స) అందించాలి. అలాగే ఈ చికిత్సతో ఇచ్చే ఔషధాలు వ్యాధినీ, దోషాన్నీ సరిచేసేవై ఉంటాయి. మధుమేహాన్ని సమూలంగా నయం చేయడానికి ప్రధానంగా ఆహారం, విహారం, ఔషధం అనే మూడు మార్గాల్లో చికిత్స అందించాలి. 


ఆహారం: లఘు ఆహారం, పత్యం, బార్లీ, గోధుమలు, పెసలు, సెనగలు, నేరేడు, ఉసిరి, పసుపు, తేనె, గోమూత్రం, ఆవాలు ఆహారంగా తీసుకోవాలి. 


విహారం: క్రమం తప్పక నిత్యం అభ్యంగనం, వ్యాయామంతో పాటు భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల వ్యవధి పాటించాలి. 


ఔషధం: ఫలిత్రికాది కషాయం, చంద్రప్రభావతి, వసంత కుసుమాకుర రసం, సువర్ణరాజవంగేశ్వరం వంటివి. 


మధుమేహం అంటే?

శరీరం శక్తిని ఖర్చు చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయే స్థితినే మధుమేహం అంటారు. ఆహారం జీర్ణం అయిన తర్వాత తయారయ్యే గ్లూకోజ్‌ని శరీరం ఉపయోగించుకోలేకపోతుంది. దాంతో రక్తంలో, మూత్రంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఆహారంలోని పిండి పదార్థాలు చక్కెరగా మారతాయి. శరీరంలోని కణాలకు శక్తి అందాలంటే చక్కెర తప్పనిసరి. ఇలా చక్కెరను శక్తిగా మార్చుకుని ఉపయోగించుకోవడానికి ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ అవసరం. డయాబెటిస్‌ మిల్టిలస్‌ అనే రుగ్మత కలిగినవారి శరీరంలో సరిపడా ఇన్సులిన్‌ తయారు కాదు. లేదా తయారైన ఇన్సులిన్‌ గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకోలేకపోవచ్చు. ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి రక్తనాళాలతోపాటు, కీలకమైన గుండె, మూత్రపిండాలు, కళ్లు, నాడీ వ్యవస్థలు దెబ్బతింటాయి.


రకాలు

మూత్రంలో తేడాలని ఆయుర్వేదంలో ప్రమేహ అంటారు. శరీరంలో దోషాలను బట్టి వచ్చే ప్రమేహ, మధుమేహాల్లో దాదాపు 20 రకాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. వాత దోషం ఉన్నవారికి వచ్చే మధుమేహాల్లో నాలుగు రకాలు, పిత్త దోషం ఉన్నవారికి ఆరు రకాలు, కఫ దోషం ఉన్నవారికి పది రకాలు ఉంటాయి. ప్రమేహంకు చికిత్స చేయకపోతే అది మధుమేహంగా మారుతుంది. ఇదే టైప్‌2 డయాబెటిస్‌. బద్ధకంగా, ఉత్సాహం లేకుండా ఉండే కఫ దోషం కలిగిన వ్యక్తులు తినే ఆహారంలో కూడా నియమాలు పాటించలేరు. మధుమేహానికి సంబంధించిన లక్షణాలతో పాటు వీరికి చేతుల్లో తిమ్మిర్లు, మంటలు, పొడి నోరు, నోటిలో తీపి రుచి ఉంటుంది. 


ఆయుర్వేదంలో మధుమేహానికి చెందిన వ్యక్తులను  మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. 


కఫజ: అజీర్తి, ఆకలి మందగించడం, జ్వరం, ముక్కు కారడం, నీరసం, వాంతులు వీరి ప్రధాన లక్షణాలు. 

పిత్తజ: మూత్రాశయంలో నొప్పి, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌, జ్వరం, అసిడిటీ, వాంతులు, విరేచనాలు, నిద్రలేమి ప్రధాన లక్షణాలు. 

వతజ: వీరిలో తీవ్రమైన జలుబు, దగ్గు ఉంటుంది. ఊపిరి తీసుకోవడంలో సమస్య ఉంటుంది. మలబద్దకం, నీరసం, వణుకు, చలి ఉంటాయి.


చిట్కాలు


ఉసిరి: విత్తనాలు తొలగించిన మూడు ఉసిరికాయలను తీసుకుని ముద్దగా నూరి, రసం తీయాలి. రెండు చెంచాల ఉసిరి రసం గ్లాసుడు నీళ్లలో కలుపుకుని పరగడుపున తాగాలి. విటమిన్‌ సి పుష్కలంగా ఉన్న ఈ రసం పిత్తాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. 


కాకర: కాకరతో మధుమేహం అదుపులో ఉంటుంది. కనుక ఆహారంలో దీన్ని చేర్చుకోవాలి. రసం తీసుకొని తాగినా, కూరగా వండుకుని తిన్నా ఫలితం కనిపిస్తుంది. కాకర రసాన్ని పరగడుపునే తాగాలి. కాకర శరీరంలో గ్లూకోజ్‌ శక్తిగా మారే ప్రక్రియను పెంచుతుంది. పిత్తాశయం నుంచి ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ సమస్య అదుపులో ఉంటుంది. 


దాల్చిన చెక్క: ఇన్సులిన్‌ పనితీరును మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి దాల్చినచెక్క తోడ్పడుతుంది. అప్పటికే ఉన్న మధుమేహాన్ని అదుపులో ఉంచడంతో పాటు ఈ వ్యాధి లేని వారికి దాని నుంచి రక్షణ కల్పిస్తుంది. కప్పు నీళ్లలో రెండు దాల్చినచెక్క ముక్కలు వేసి, 20 నిమిషాలపాటు మరిగించి, రోజుకు ఒసారి తాగాలి. 


కలబంద: రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో కలబంద సమర్థమైనది. చెంచా కలబంద రసానికి మరొక చెంచా పసుపు, బిర్యానీ ఆకు పొడి చేర్చి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 


తినాల్సినవి... తినకూడనివి... 


తినకూడనివి: అన్నం, బంగాళదుంపలు, తీయగా ఉండే పండ్లు, మైదా, గోధుమలు, నూనెలో వేయించిన కూరలు, సగ్గుబియ్యం. 


తినవలసినవి: కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, పెసలు, రాగులు, మొక్కజొన్న, బార్లీ, బఠాణీ, పప్పులు, మినుములు, సోయా, సెనగలు, బచ్చలికూర. 


జాగ్రత్తలు


రక్తపరీక్ష: మధుమేహాన్ని పరీక్షించడానికి తేలికైన మార్గమిది. కనుక రక్తంలో చక్కెర స్థాయిని కొలవడం కోసం క్రమం తప్పకుండా రక్తపరీక్ష చేయించుకోవాలి. 


వ్యాయామం: చక్కెరను సమంగా ఉంచడానికి సులువైన మార్గం వ్యాయామం. వ్యాయామం చేసినప్పుడు గ్లూకోజ్‌ శక్తిగా మారుతుంది. కండరాల కదలికలకు గ్లూకోజ్‌ను వినియోగించకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 


పిండి పదార్థాలు: క్రమం తప్పని ఆహార శైలి పాటించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం మానేయకూడదు. తీసుకొనే ప్రతి పదార్థంలో పిండి పదార్థాల పరిమాణం లెక్కించాలి. వాటిని తీసుకున్న ప్రతిసారీ మాంసకృత్తులు జోడించాలి. పొట్టు తీయని ధాన్యాలు, కూరగాయలు తినాలి. 


కృత్రిమ తీపి: శరీరం చక్కెరను నియంత్రణలో ఉంచే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కనుక చక్కెర బదులు కృత్రిమ చక్కెర వాడడం మానేయాలి. 


శరీర బరువు: జీవసంబంధ రుగ్మతలకు మూల కారణం స్థూలకాయమే. కాబట్టి శరీరం బరువు తగ్గేలా ఆహార నియమాలు పాటించాలి. 


కొలెస్ర్టాల్‌: మధుమేహం నియంత్రణ తప్పితే దీర్ఘకాలంలో కొలెస్ర్టాల్‌ మీద కూడా ప్రభావం చూపుతుంది. కనుక ఏడాదికోసారి కొలెస్ర్టాల్‌ పరీక్షించుకొంటూ ఉండాలి. 


పీచు: ఓట్స్‌, నట్స్‌, పండ్లు, కూరగాయల ద్వారా తగినంత పీచు పదార్థాలు అందేలా చూసుకోవాలి. ఇది చక్కెర రక్తంలో కలిసే వేగాన్ని తగ్గిస్తుంది. పీచువల్ల టైప్‌2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలూ తగ్గుతాయి. 


కంటి పరీక్షలు: అధిక మధుమేహం వల్ల కంట్లోని కటకాలు వాపు చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే క్రమం తప్పక కంటి పరీక్షలు చేయించుకొంటూ ఉండాలి. 


పాదాల పరీక్ష: కంటి పరీక్షలాగే పాదాలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. 


మూత్రపిండాలు: మధుమేహం ఉన్నవాళ్లకు కాలక్రమంలో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కనుక ఏడాదిలో కనీసం రెండుసార్లు మూత్రపిండాల పరీక్ష చేయించుకోవాలి. 

Updated Date - 2021-12-28T05:30:00+05:30 IST