High Court ఆదేశాల మేరకు అమరావతిలో అభివృద్ధి పనులు: Vivek Yadav
ABN , First Publish Date - 2022-07-04T18:45:56+05:30 IST
హైకోర్టు ఆదేశాల మేరకు అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివేక్ యాదవ్ వెల్లడించారు.
అమరావతి (Amaravathi): హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని సీఆర్డీఏ (CRDA) కమిషనర్ వివేక్ యాదవ్ (Vivek Yadav) పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో జోన్-4 (Zone-4) లే ఔట్కి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. దశల వారిగా అమరావతిలో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. జోన్-4లో రూ. 192.52 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నామని, 63 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటాయన్నారు. జోన్-4లో 1358.42 ఎకరాల్లో 4551 ప్లాట్లు మౌలిక వసతులు అభివృద్ధి జరగనుందని, సీడ్ యాక్సెస్ రహదారిలో 4 చోట్ల కనెక్టీవిటీ లేదని, అది త్వరలో పూర్తి చేస్తామన్నారు. మిగిలిన జోన్లలో కూడా అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అమరావతిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే రూ. 2,500 భృతి మూడు నెలలు పెండింగ్ ఉందని, 15 రోజుల్లో ఒక నెల రూ. 2,500 భృతి జమచేస్తామన్నారు. తదుపరి రెండు నెలలు త్వరలో ఇస్తామన్నారు. అసైన్డ్ భూముల సమస్య తొలిగిపోయాక... కౌలు జమచేస్తామని వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.