అమరావతిని అంగుళమైనా కదల్చలేరు
ABN , First Publish Date - 2022-10-04T06:15:03+05:30 IST
ఐదుకోట్ల మంది కోరుకునే అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని రాజధాని రైతులు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష అమరావతి అన్నారు.
1020వ రోజుకు రాజధాని ఆందోళనలు
తుళ్లూరు, అక్టోబరు 3: ఐదుకోట్ల మంది కోరుకునే అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని రాజధాని రైతులు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష అమరావతి అన్నారు. వారి అభిమతం ప్రకారం పాలకులు నడుచుకోవాల్సిందే అన్నారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు సోమవారం 1020వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, దానిని చూసి ఓర్వలేక మంత్రులు, ఎమ్మెల్యేలు దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రను అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారన్నారు. మహిళలను అవమానిస్తున్న పాలకులు తగిన బుద్ధి చెపుతామన్నారు. ఇప్పటికైనా హైకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. లేదంటే పదవులకు రాజీనామాలు చేయాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి బిల్డ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు.