నమ్మించి మోసం!

ABN , First Publish Date - 2020-12-02T15:53:37+05:30 IST

రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత..

నమ్మించి మోసం!

350వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతుల ఆగ్రహం


తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి: రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని రాజధాని రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కోసం వారు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 350వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమరావతికి 30 వేల ఎకరాలు కావాలి,  అది కూడా విజయవాడ గుంటూరు మధ్య  ఉండాలని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ అన్న మాటలను గుర్తు చేశారు. జగన్‌ మాట, మడమ రెండూ తప్పాడన్నారు. అమరావతిని నిర్వీర్యం చేసి, మూడు ముక్కల ఆట మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమున్నప్పుడు అమరావతి,  లేకపోతే జగన్‌ ప్యాకేజీతో మూడు రాజధానుల పాట పాడుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా కాగడాలు, కొవ్వొత్తులు వెలిగించి మందడం శిబిరంలో నిరసనలు తెలిపారు. పోలీసులు మోహరించినా కాగడాలతో రైతులు, మహిళలు నినాదాలు చేశారు. 


మందడంలో ఉద్రిక్తం

అసెంబ్లీ సమావేశాల రెండో రోజు మందడం రైతు శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతులు, మహిళలు సీఎం కనిపించడం లేదంటూ శిబిరం నుంచే చేతులతో కళ్లు పెద్దగా చేసి చూస్తూ నిరసన తెలిపారు. సీఎం వచ్చే ప్రతిసారి పోలీసులు కర్ఫ్యూ  ఏర్పాటు చేస్తున్నారంటూ మండిపడ్డారు. శిబిరం నుంచి, ఇళ్ల నుంచి  బయటకు రావద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారన్నారు.  ఇటువంటి పాలన ఎక్కడా లేదని వాపోయారు. మందడం శిబిరంలో మంత్రి కొడాలి నాని దిష్టి బొమ్మను ఉంచారు. ఈ విషయమై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత స్థలంలోని శిబిరం వద్ద దిష్టిబొమ్మ పెట్టుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. పెయిడ్‌ ఆర్టిస్టులున్న మూడు రాజధానుల శిబిరం ముందున్న దిష్టిబొమ్మలు ఎందుకు తీయించరని ప్రశ్నించారు. శిబిరం తీసివేయాలని పోలీసులు సూచించగా రైతులు, మహిళలు నిరాకరించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 144 సెక్షన్‌ అంటూ శిబిరాన్ని ఖాళీ చేయించి, సీఎం మెప్పు పొందడానికి పోలీసులు పని చేస్తున్నారని మహిళలు మండిపడ్డారు.  


తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో జరుగుతున్న దీక్షలు 350వరోజుకు చేరుకున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయా శిబిరాల్లో పలువురు మాట్లాడుతూ రైతుల ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులు 350 రోజుల నుంచి రాజధాని కోసం పొరాటం చేస్తుంటే ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. 

Updated Date - 2020-12-02T15:53:37+05:30 IST