భావితరాల భవిష్యత్ నాశనం
ABN , First Publish Date - 2021-01-22T06:14:27+05:30 IST
మూడు ముక్కల ఆటతో సీఎం జగన్మెహన్రెడ్డి భావితరాల భవిష్యత్ను నాశనం చేస్తున్నారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు ముక్కలతో అమరావతి ఆశలు సమాధి
401వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతుల ధ్వజం
తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, జనవరి 21: మూడు ముక్కల ఆటతో సీఎం జగన్మెహన్రెడ్డి భావితరాల భవిష్యత్ను నాశనం చేస్తున్నారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు గురువారంతో 401వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలన్నీ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. మూడు రాజధానులతో అమరావతి ఆశలను సమాధి చేస్తున్నారన్నారు. న్యాయదేవత రైతుల పక్షాన ఉందని, రాజధాని విషయంలో ప్రభుత్వానికి త్వరలో చుక్కెదురవుతుందన్నారు. రైతులు రోడ్డు మీద పడి ఏడుస్తుంటే, నాలుగు గోడల మధ్య కూర్చొని సీఎం జగన్ నవ్వుకుంటున్నారన్నారు. న్యాయబద్ధ పాలన ఉంటే న్యాయస్థానాలు ఎందుకు జోక్యం చేసుకుంటాయని ప్రశ్నించారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగగా, ప్రతి ఇంటి వద్ద అమరావతి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ, తాడేపల్లి మండలం పెనుమాక గ్రామాల్లో రైతులు చేపట్టిన రిలే దీక్షలు 401వ రోజుకు చేరాయి. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో వరుసగా మూడో రోజు శ్రీ విద్యా మహాయాగం నిర్వహించారు. యాగంలో భాగంగా శ్రీ చక్ర కుంకుమార్చన పూజలు చేశారు.