నిర్మించండి.. నాశనం చేయవద్దు
ABN , First Publish Date - 2022-07-07T05:14:49+05:30 IST
భావితరాల భవిష్యత్ కోసమే 33వేల ఎకరాలు త్యాగం చేసినట్లు రాజధాని రైతులు పేర్కొన్నారు.
932వ రోజుకు చేరుకున్న అమరావతి ఆందోళనలు
తుళ్లూరు, జూలై 6: భావితరాల భవిష్యత్ కోసమే 33వేల ఎకరాలు త్యాగం చేసినట్లు రాజధాని రైతులు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు బుధవారం 932వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల నుంచి రైతులు, మహిళలు, రైతు కూలీలు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారితే రాజధాని మారదన్నారు. అమరావతిలో పదివేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగితే, అసలు ఏమీ జరగలేదని పాలకులు ప్రచారం చేయటం దౌర్భాగ్యమన్నారు. గ్రాఫిక్స్ కట్టడాలని అబద్ధాలు ఆడారన్నారు. గ్రాఫిక్స్ అయితే అందులో ఉండి పాలన ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టారన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చే విధంగా పాలకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. పౌరుషంతో అమరావతిని అభివృద్ధి చేసే గౌరవం దక్కుతుందన్నారు. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి.