ఒక్క చాన్స్‌ ఇస్తే అభివృద్ధిని నిలిపేశారు

ABN , First Publish Date - 2022-06-25T05:32:57+05:30 IST

ఒక్క ఛాన్స్‌ అని చెప్పి అధికారంలోకి వచ్చి అభివృద్ధి లేకుండా చేశారని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.

ఒక్క చాన్స్‌ ఇస్తే అభివృద్ధిని నిలిపేశారు
బిల్డ్‌ అమరావతి , హైకోర్టు తీర్పును అమలు చేయాలని నినాదాలు చేస్తున్న వెలగపూడి శిబిరంలోని రైతులు

920వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళలను 

తుళ్ళూరు, జూన్‌ 24: ఒక్క ఛాన్స్‌ అని చెప్పి అధికారంలోకి వచ్చి  అభివృద్ధి లేకుండా చేశారని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 920వ రోజుకు చేరుకున్నాయి తుళ్లూరు, మందడం, నెక్కల్లు, దొండపాడు, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, వెంకటపాలెం, ఐనవోలు తదితర రాజధాని గ్రామాల్లోని రైతు ధర్నా శిబిరాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు, మహిళలు, రైతుకూలీలు ధర్నా శిబిరాల నుంచి మాట్లాడుతూ అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పి అధికారం చేపట్టగానే మాట తప్పి, మడమ తిప్పి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. ఇంతకంటే నమ్మక ద్రోహం ఎక్కడా ఉండదన్నారు. మూడు ముక్కల ఆటతో రాజధానికి భూములిచ్చిన తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. భావితరాల వారి భవిష్యత్‌ బాగుంటుందని ఇస్తే ఒక్క తట్ట మట్టి కూడా వేయకుండా అమరావతి అభివృద్ధిని నిలిపివేశారన్నారు. అన్నీ వర్గాల ప్రజలు రాజధానికి భూములు త్యాగం చేస్తే ఒక సామాజిక వర్గం అంటూ పాలకులు ప్రచారం చేశారన్నారు.  హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. 


Updated Date - 2022-06-25T05:32:57+05:30 IST