వైసీపీ మంత్రులకు లోకేష్ సవాల్
ABN , First Publish Date - 2020-12-01T18:28:32+05:30 IST
మనసులో మాట పుస్తకంపై ఏపీ శాసనమండలిలో రెండోరోజు వివాదం నెలకొంది.
అమరావతి: మనసులో మాట పుస్తకంపై ఏపీ శాసనమండలిలో రెండోరోజు వివాదం నెలకొంది. మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వ్యవసాయం దండగ అని చంద్రబాబు ఎక్కడ అన్నారో నిరూపించాలి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు. దీనికి సంబంధించి మంత్రులు అనిల్ కుమార్, కన్నబాబులకు లోకేష్ సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డిని మంత్రులు బొత్స, కన్నబాబు ఏమని విమర్శించారో తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఆధారాలుంటే నిరూపించాలని లోకేష్ సవాల్ చేశారు.
అలాగే వైవీబీ రాజేంద్రప్రసాద్ కూడా వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ చంచల్ గూడ పార్టీ అని గతంలో కన్నబాబు అనలేదా? అని ప్రశ్నించారు. అదే పార్టీలో చేరి ఇప్పుడు మంత్రి పదవి తీసుకున్నారని అన్నారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు ఎక్కడా అనలేదని... రుజువులు, సాక్ష్యాలతో మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. ‘‘మనసులో మాట పుస్తకం మీరు తీసుకురాలేకపోయారు కనుకనే మేము తీసుకువచ్చాం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా పుస్తకంలోని మాటలను రాజేంద్రప్రసాద్ మండలిలో చదివి వినిపించారు.