భారత్‌ మీడియాతో పోల్చి అవమానిస్తారా?.. బైడెన్‌పై అమెరికా పాత్రికేయుల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-09-29T07:05:48+05:30 IST

‘‘అమెరికన్‌ మీడియా కన్నా భారత మీడియానే మెరుగ్గా వ్యవహరించింది. మీ

భారత్‌ మీడియాతో పోల్చి అవమానిస్తారా?.. బైడెన్‌పై అమెరికా పాత్రికేయుల ఆగ్రహం

మమ్మల్ని అంత మాట అంటారా?.. బైడెన్‌పై అమెరికా పాత్రికేయుల ఆగ్రహం


వాషింగ్టన్‌, సెప్టెంబరు 28: ‘‘అమెరికన్‌ మీడియా  కన్నా భారత మీడియానే మెరుగ్గా వ్యవహరించింది. మీ అనుమతితో మనం మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకూడదనుకుంటున్నాను. ఎందుకంటే అమెరికా పాత్రికేయులు అసలు విషయానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలూ అడగరు’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై అమెరికన్‌ మీడియా మండిపడుతోంది. అమెరికా పాత్రికేయులు దీనిపై ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీని నిలదీశారు.


దీంతో బైడెన్‌ ఉద్దేశం అది కాదని.. పాత్రికేయుల మనసు నొప్పించే ఉద్దేశం ఆయనకు లేదంటూ పాత్రికేయులను సముదాయించేందుకు ప్రయత్నించారు. తాను మాట్లాడదల్చుకున్న నిర్ణీత అంశంపై మాత్రమే అమెరికా పాత్రికేయులు ప్రశ్నలు అడగరన్నదే బైడెన్‌ ఉద్దేశమని వివరణ ఇచ్చారు. విదేశీ నేత (మోదీ) ముందు మౌనంగా ఉండాలని బైడెన్‌ భావించారా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని సాకీ సమాధానమిచ్చారు. విదేశీ నేతలతో కలిసి బైడెన్‌ పలుమార్లు మీడియాతో మాట్లాడారని గుర్తుచేశారు. ఇకముందూ అలా చేస్తారని తేల్చిచెప్పారు.


‘‘అమెరికా మీడియా కంటే భారత మీడియా మెరుగ్గా ప్రవర్తించిందని ప్రెసిడెంట్‌ అన్నారు. కానీ.. ‘రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ జాబితా ప్రకారం ‘పత్రికా స్వేచ్ఛ’ విషయంలో భారతీయ మీడియా ప్రపంచంలోనే 142వ స్థానంలో  ఉంది. అలాంటప్పుడు భారతీయ మీడియాను అమెరికన్‌ మీడియాతో ఎలా పోలుస్తారు?’’ అని మరో విలేకరి సాకీని ప్రశ్నించారు. 

Updated Date - 2021-09-29T07:05:48+05:30 IST