Bihar politics: షా పూర్తిగా మ్యాడ్ అయ్యారు: లాలూ
ABN , First Publish Date - 2022-09-25T01:27:42+05:30 IST
బీహార్ రాజకీయాలపై బీజేపీ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. బీజేపీకి నితీష్ కుమార్ నమ్మకద్రోహం చేశారంటూ..
పాట్నా: బీహార్ రాజకీయాలపై బీజేపీ (Bjp), ఆర్జేడీ (Rjd) మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. బీజేపీకి నితీష్ కుమార్ నమ్మకద్రోహం చేశారంటూ కేంద్రం హోం మంత్రి అమిత్షా (Amit sha) చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ (Lalu prasad yadav) శనివారంనాడు ఘాటుగా తిప్పికొట్టారు. ''అమిత్ షాకు పూర్తిగా మతిపోయింది (completely Mad). అక్కడ (బీహార్) ఆయన ప్రభుత్వం కూలిపోయింది. 2024 లోనూ ఓడిపోతుంది. దాంతోనే ఆయన అక్కడా ఇక్కడా తిరుగుతూ జంగిల్ రాజ్ అంటూ మాట్లాడుతున్నారు. గుజరాత్లో ఉన్నప్పుడు ఆయన ఇదే (jungle raj) చేశారా? అని ప్రశ్నించారు.
గుజరాత్లో ఆయన ఉన్నప్పుడు అక్కడ ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) ఉండేదని, ఆయనో పిచ్చోడని లాలూ వ్యాఖ్యానించారు. 2024లో కేంద్రంలోనూ, బీహార్లోనూ బీజేపీనే తిరిగి అధికారంలోకి వస్తుందంటూ అమిత్షా చెప్పడంపై అడిగినప్పుడు ''చూద్దాం'' అని లాలూ టూకీగా సమాధానమిచ్చారు. అధికారం కోసం ఆర్జేడీతో చేతులు కలిపిన నితీష్ ఆ తర్వాత కూడా అధికారం కోసం ఆర్జేడీకి ఉద్వాసన చెబుతారని బీజేపీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, తాము (జేడీయూ-ఆర్జేడీ) కలిసే ఉన్నామని చెప్పారు.
సోనియాను కలుసుకోనున్న లాలూ, నితీష్
కొద్దికాలంగా అస్వస్థతతో ఉన్న లాలూప్రసాద్ యాదవ్ ఆదివారంనాడు నితీష్కుమార్తో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకునే అవకాశం ఉంది. విపక్షాల ఐక్యత కోసం తాము చేయాల్సిన ప్రయత్నమంతా చేస్తామని, తమ సమావేశం ప్రధాన ఎజెండా కూడా అదేనని లాలూ చెప్పారు.