కేసీఆర్‌ను గద్దె దించేందుకు నేను రానక్కరలేదు.. బండి సంజయ్ ఒక్కడు చాలు: అమిత్ షా

ABN , First Publish Date - 2022-05-15T01:36:26+05:30 IST

కేసీఆర్‌ను గద్దె దించేందుకు నేను రానక్కరలేదు.. బండి సంజయ్ ఒక్కడు చాలు: అమిత్ షా

కేసీఆర్‌ను గద్దె దించేందుకు నేను రానక్కరలేదు.. బండి సంజయ్ ఒక్కడు చాలు: అమిత్ షా

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శలు తీవ్రస్థాయిలో గుప్పించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో షా మాట్లాడుతూ.. కేసీఆర్‌ను గద్దె దించేందుకు తాను అవసరం లేదని, బండి సంజయ్ ఒక్కడు చాలని అన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం చేసిన యాత్ర అని అన్నారు. రాష్ట్రంలోని నిరంకుశపాలనను అంతమొందించడం కోసం  జరిగిన యాత్ర అని స్పష్టం చేశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, రాష్ట్రంపై అందరికీ సమానహక్కు ఉందని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారని షా మండిపడ్డారు.


తెలంగాణ మారాలా? వద్దా? అని ప్రశ్నించిన షా.. హైదరాబాద్ నిజాంను మార్చేందుకే యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు అందించారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే వాటిని అమలుచేసి చూపిస్తామని అన్నారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్న కేసీఆర్ వాగ్దానం ఏమైపోయిందని నిలదీశారు. హైదరాబాద్‌లో కొత్తగా 4 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టిస్తామని కేసీఆర్ అంటున్నారని, ఒకసారి గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో పరిస్థితి ఏంటో చూడాలని అమిత్ షా ప్రజలను కోరారు.


కేసీఆర్ మజ్లిస్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, ఆ పార్టీ అంటే కేసీఆర్‌కు భయమని అన్నారు. తెలంగాణ విమోచనదినం గురించి కేసీఆర్ వాగ్దానం చేశారా? లేదా? అని షా ప్రశ్నించారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని, టీఆర్ఎస్, మజ్లిస్‌ను ఒకేసారి విసిరేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని బెంగాల్‌లా మారుద్దామని కేసీఆర్ భావిస్తున్నారని షా విమర్శించారు. సాయిగణేష్ హత్యపై ఏం సమాధానం చెబుతారని? ప్రశ్నించారు. 

Read more