అమ్మఒడి జాబితా విడుదల
ABN , First Publish Date - 2022-06-26T07:01:35+05:30 IST
చిత్తూరు జిల్లా అమ్మఒడి లబ్ధిదారుల జాబితా వెలువడింది. సోమవారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున రూ.199.34 లక్షలు జమకానుంది.
రేపు తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ
చిత్తూరు (సెంట్రల్), జూన్ 25: చిత్తూరు జిల్లా అమ్మఒడి లబ్ధిదారుల జాబితా వెలువడింది. సోమవారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున రూ.199.34 లక్షలు జమకానుంది. 31 మండలాల చిత్తూరు జిల్లా పరిధిలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 2,74,008 మంది విద్యార్థులు చదువుతున్నారు. వివిధ కారణాలు చూపుతూ 1,20,668 మందిని అనర్హులుగా తేల్చారు. మిగిలిన 1,53,340 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. అత్యధికంగా చిత్తూరులో 14,123 మంది ఎంపిక కాగా, అత్యల్పంగా పాలసముద్రం మండలంలో 1,514 మంది ఎంపికయ్యారు. ఒకటి నుంచి పదవ తరగతి వరకు 1,28,800 మంది ఉండగా, ఇంటర్మీడియట్లో 24,540 మందిని అమ్మఒడికి అర్హులుగా గుర్తించారు.
రేపు నాగయ్య కళాక్షేత్రంలో జిల్లా కార్యక్రమం
అమ్మఒడి జిల్లా స్థాయి కార్యక్రమం సోమవారం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు శనివారం హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమీకరణపై చర్చించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఈవో విజయేంద్రరావు, హెచ్ఎంలు పాల్గొన్నారు.