అమ్మ ఒడికి కోత

ABN , First Publish Date - 2022-05-26T05:54:36+05:30 IST

అమ్మఒడి పథకానికి ప్రభుత్వం రూ. రెండువేలు కోత పెట్టాలని నిర్ణయించింది.

అమ్మ ఒడికి కోత

రూ.15 వేలకు ఇచ్చేది రూ.13 వేలే

గతంలోనే రూ. వెయ్యి కట్‌

తాజాగా మరో వెయ్యి


ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 25 : అమ్మఒడి పథకానికి ప్రభుత్వం రూ. రెండువేలు కోత పెట్టాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఇవ్వాల్సిన రూ.15 వేలలో ఇప్పటికే రూ.వెయ్యి కోత విధించి రూ. 14 వేలు ఇస్తోన్న ప్రభుత్వం తాజాగా మరో వెయ్యి మినహాయించుకుని రూ.13 వేలను అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలకు జమచేయనుంది. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ. వెయ్యి ఇప్పటికే తగ్గిస్తోంది. మళ్లీ ఇపుడు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల నిర్వహణకంటూ మరో రూ. వెయ్యి తగ్గించేందుకు సిద్ధపడింది. ఇలా లబ్ధిదారుల నుంచి మినహాయించుకున్న మొత్తాన్ని జిల్లా విద్యాశాఖ ద్వారా పాఠశాలల నిర్వహణకు వినియోగిస్తారు. వాస్తవానికి పాఠశాలల నిర్వహణకు ఏటా సమగ్రశిక్ష ప్రాజెక్టు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిఽఽధులు కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మ ఒడి భారాన్ని తగ్గించుకునేందుకే పలు కఠిన షరతులు పెట్టిన ప్రభుత్వం, అదే క్రమంలో ఇపుడు లబ్ధిదారులను తగ్గిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ–కేవైసీ షరతుల వల్ల పలువురు ఈ పథకానికి అనర్హులయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకోవైపు హాజరు శాతం సరిపోలేదంటూ విద్యార్థులను అర్హుల జాబితా నుంచి ఎడాపెడా తొలగించారు.


జిల్లాలో 1.72 లక్షల మంది లబ్ధిదారులు

జిల్లాలో ఈ ఏడాది 2,64,457 మంది విద్యార్థులను అమ్మఒడి పథకానికి అర్హులుగా ప్రాఽథమికంగా నిర్ధారించారు. వీరిలో 1,72,749 మంది తల్లులను ఆర్థిక సాయానికి అర్హులుగా గుర్తించారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల్లో అర్హుల సంఖ్య ఇంకా తేలాల్సి ఉంది. 


Updated Date - 2022-05-26T05:54:36+05:30 IST