అమరావతిని కాపాడుకుందాం
ABN , First Publish Date - 2021-03-01T09:34:19+05:30 IST
అమరావతి అమ్మలాంటిదని.. విశాఖ ఉక్కు ఆంధుల హక్కు అని అమరావ తి రైతులు నినదించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి రైతులు చేస్తున్న ఆందోళనలు
439వ అమరావతి రైతుల ఆందోళనలు
తుళ్లూరు: ఫిబ్రవరి 28: అమరావతి అమ్మలాంటిదని.. విశాఖ ఉక్కు ఆంధుల హక్కు అని అమరావ తి రైతులు నినదించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారంతో 439వ రోజకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమరావతిని కాదంటే ఐదు కోట్ల మందిని అవమానించినట్టేనన్నారు. మూడు రాజధానులు అంటూ.. ఐదు కోట్ల మంది ఆంధ్రులను కేరాఫ్ ఫ్లాట్పాంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై పాలకులు కక్ష పెంచుకున్నారని దళిత జేఏసీ సభ్యులు పేర్కొన్నారు.
అమరావతి అంటే అమ్మ లాంటిదని, కారణం.. కన్న తల్లిలాంటి భూములు రాజధానికి ఇచ్చామని చెప్పారు. అన్నం పెట్టే అమ్మను జగన్మోహన్రెడ్డి మూడు ముక్కలు చేయాలని దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. ఐదేళ్ల నుంచి అమరావతి రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తుంటే మూడు ముక్కల ఆటతో నిర్వీర్యం చేశారని వాపోయారు. తుళ్లూరు, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు, దొండపాడు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, వెలగపూడి, ఐనవోలు, నేలపాడు తదితర రైతు దీక్షా శిబిరాల్లో రైతులు ఆందోళనలు కొనసాగించారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా సాయంత్రం దీపాలు వెలింగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఆందోళనలో భాగంగా.. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆంధ్రుల త్యాగఫలంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా పోరాడి కాపాడుకుందామని నినదించారు. అమరావతి, ఉక్కు ఉద్యమాలకు అందరూ మద్దతుగా నిలవాలని కోరారు.