ప్రభుత్వ ఆస్పత్రిలో ఐఏఎస్ అధికారి ప్రసవం
ABN , First Publish Date - 2022-10-04T06:24:34+05:30 IST
ప్రభుత్వ ఆస్పత్రిలో ఐఏఎస్ అధికారి ప్రసవం
భూపాలపల్లి కలెక్టరేట్, అక్టోబరు 3: ఆమె ఐఏఎస్ అధికారి. ములుగు జిల్లాకు అదనపు కలెక్టర్. భర్త భూపాలపల్లి జిల్లాకు కలెక్టర్. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న సేవల పట్ల ప్రజలకు నమ్మకం పెంచేందుకు ఆ దంపతులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రభు త్వ ఆస్పత్రిలోనే ఆమె ప్రసవం చేయించుకొని ఆద్శర్శంగా నిలిచారు.
భూపాలలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా సతీమణి ఇలా త్రిపాఠి ములుగు అదనపు కలెక్టర్గా కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఆస్ప త్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని మొదటి నుంచి వీరు రెండు జిల్లాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సౌకర్యం ఉందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా త్రిపాఠి నెలలు నిండటంతో ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని ఆమెతోపాటు భర్త భవేష్ మిశ్రా నిర్ణయించారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో సర్కారు ఆస్పత్రులపై నమ్మకం మరింత పెరుగుతుందని వారి ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో భూపాలపల్లి మంజూర్నగర్లోని వంద పడకల ఆస్పత్రిలో ఇలా త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. శిశువు 3.4 కిలోల బరువు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తల్లీబిడ్లలు ఆరోగ్యంగానే ఉన్నారని డీసీహెచ్వో ఆకుల సంజీవయ్య చెప్పారు. తొలి సంతనం కావడంతో కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపుల కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆనందం వ్యక్తం చేశారు. మొదటి నుంచి సాధారణ కాన్పుకే వైద్యులు ప్రయత్నించగా పూర్తిగా నెలలు నిండటం వల్ల ఇలా త్రిపాఠికి వైద్యులు సిజేరియన్ చేసి డెలవరీ చేశారు. ప్రసవం చేసిన బృందంలో డాక్టర్లు శ్రీదేవి, సంధ్య, లావణ్య, అనూష, రాధిక, అనిస్థిషియా నిపుణుడు శ్రీకాంత్తోపాటు ఆర్ఎంవో ప్రవీణ్ ఉన్నారు.