ఆధునిక హంగులతో సమీకృత మార్కెట్‌

ABN , First Publish Date - 2020-08-08T10:03:55+05:30 IST

అన్ని హంగులు, ఆధునిక సౌకర్యాలతో త్వరలో వనపర్తిలో సమీకృత మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి

ఆధునిక హంగులతో సమీకృత మార్కెట్‌

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


వనపర్తి అర్బన్‌, ఆగస్టు 7 : అన్ని హంగులు, ఆధునిక సౌకర్యాలతో త్వరలో వనపర్తిలో సమీకృత మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేయనున్న ఆధునిక సమీకృత మార్కెట్‌ స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. రెండు ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఈ మార్కెట్‌ ప్రాంగణంలో మార్కెటింగ్‌ శాఖ ద్వారా నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న జనాభా కలుపుకొని పట్టణంలో ప్రతి రోజు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కలుపుకొని లక్ష వరకు జనాబా ఉంటుందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.


మార్కెట్‌లో కూరగాయలతో పాటు మాంసం, గుడ్లు, చేపలు, ఇతర అన్ని రకాల దినుసులు, ఆహార పదార్థాలు దొరికేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక ఫార్మసీ కూడా ఏర్పాటు చేస్తామని, ప్రతి రోజూ వైద్యులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిన్న పిల్లల కోసం ఆటస్థలం సముదాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో అంచనాలను రూపొందిస్తే త్వరితగతిన టెండర్లను పిలిచి పనులుప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ఆయన వెంట కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌ బాషా, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటీ శ్రీధర్‌ ఉన్నారు.

Updated Date - 2020-08-08T10:03:55+05:30 IST