KERALA FISHER MAN: చేపల వలలో వింత వస్తువు.. విలువ 28 కోట్లు..!
ABN , First Publish Date - 2022-07-24T01:02:06+05:30 IST
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని అదృష్టం వరించింది. చేపల కోసం వేట సాగిస్తుండగా.. మత్స్యకారులకు కోట్ల రూపాయల విలువైన తిమింగలం వాంతి దొరికింది...
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని అదృష్టం వరించింది. చేపల కోసం వేట సాగిస్తుండగా.. మత్స్యకారులకు కోట్ల రూపాయల విలువైన తిమింగలం వాంతి దొరికింది. మత్స్యకారులకు లభించిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు కాగా.. మార్కెట్లో దాని విలువ 28 కోట్లకు పైగానే ఉంటుందట. కేరళలోని విజింజమ్కు 32 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ ఘటన జరిగింది. స్థానిక మత్స్యకారులు చేపలు పడుతుండగా.. తిమింగలం వాంతి నీటిపై తేలియాడింది. దాంతో వాంతిని మొదట చూసిన మత్స్యకారులు అనుమానపడ్డారు. ఆ తర్వాత దగ్గరకు వెళ్లి తిమింగలం వాంతిగా గుర్తించారు.
అనంతరం బోటులో దానిని ఒడ్డుకు చేర్చి తిమింగలం వాంతి అని నిర్ధారించుకున్నామని తెలిపారు. ఆ తర్వాత తిమింగలం వాంతిని కోస్టల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు విజింజమ్కు చేరుకుని తిమింగలం వాంతిని రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్కు తరలించారు. సుగంధ ద్రవ్యాల తయారీకి తిమింగలం వాంతిని ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. ఒక కిలో అంబర్గ్రిస్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు కోటి రూపాయలు వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.