ఉప్పొంగిన పెన్గంగా
ABN , First Publish Date - 2022-08-10T04:18:11+05:30 IST
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతంగా రావడంతో మండలంలోని వెంకట్రావుపేట గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర పోడ్సా వంతెనతో పాటు హుడ్కిలి వద్ద గల వంతెనలను ఆనుకుని పెన్గంగా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
- మూడు రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు
- దహెగాంలో నీట మునిగిన పంటలు
సిర్పూర్(టి), ఆగస్టు 9: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతంగా రావడంతో మండలంలోని వెంకట్రావుపేట గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర పోడ్సా వంతెనతో పాటు హుడ్కిలి వద్ద గల వంతెనలను ఆనుకుని పెన్గంగా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో మూడు రాష్ట్రాలకు రాక పోకలు నిలిచిపోయాయి. సిర్పూర్(టి) ఎస్సై రవికుమార్ నది పరివాహక ప్రాంతాలను పరిశీలించి వంతెనపై రాక పోకలు జరగకుండా పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా అదే విధంగా పెన్గంగా పరివాహక లోతట్టు ప్రాంతాలైన లోనవెల్లి, కర్జపెల్లి, టోంకిని, జక్కాపూర్, మాకిడి, హుడ్కిలి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
దహెగాం: మొట్లగూడ, రాంపూర్ గ్రామాల్లోని చేలల్లోకి ప్రాణహిత బ్యాక్ వాటర్ చేరడంతో పంటలు మునిగిపోయాయి. బీబ్రా సమీపంలోని దహెగాం- కాగజ్నగర్ ప్రధాన రహదారితో పాటు లగ్గాం క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు కొట్టుకు పోవడంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.