అనంతపురం: చేపల కోసం ఘర్షణ...12మందికి గాయాలు
ABN , First Publish Date - 2020-07-05T17:15:24+05:30 IST
అనంతపురం: చేపల కోసం ఘర్షణ...12మందికి గాయాలు
అనంతపురం: చేపల కోసం ఇరు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రొద్దం మండలం తురకల పట్నం చేపల చెరువు వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇటీవల కృష్ణాజలాలతో చెరువుకు భారీగా నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో తురకల పట్నం, పెద్దకోడిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు చెరువులోని చేపల విషయంలో వాదోపవాదానికి దిగారు. గతంలో పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన చేపల సొసైటీ ఉందని...కాబట్టి తమకు అధికారం ఉంటుందని ఆ గ్రామ ప్రజలు తెలిపారు. అయితే తురకపట్నం గ్రామంలో చెరువు ఉంది కాబట్టి చేపలు పట్టే అధికారం తమ గ్రామానికే ఉంటుందని ఇక్కడి గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో ఇరు గ్రామాల ప్రజలు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. దీంతో 12 మంది గాయపడ్డారు. తాము సామరస్యంగా మాట్లాడుకుందామని తెలిపినా పెద్దకోడిపల్లి గ్రామస్తులు వినలేదని తురకపల్లి గ్రామ ప్రజలు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.