
అనంతపురం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన మహిళపై అధికార పార్టీకి చెందినవారు దారుణానికి ఒడిగట్టారు. ఆమె చీరలాగి, జాకెట్ చించి దుశ్శాసునుల్లా వ్యవహరించారు. ఈ ఘటన జిల్లాలోని సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు పద్మ కథనం ప్రకారం.. మొన్నటి పంచాయతీ పోరులో తాను రెబల్ అభ్యర్థిగా పోటీలో నిలిచినట్టు తెలిపింది. ఈ ఎన్నికల్లో వైసీపీ సానుభూతిపరుడు విజయం సాధించాడని.. ఆ విజయోత్సవాన్ని తన ఇంటి వద్ద జరిపారని చెప్పింది. పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ.. నానా హంగామా సృష్టించారని పేర్కొంది. ఆ శబ్దానికి తమ గొర్రెలు భయపడటంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశానని, దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు తన ఇంటిపై రాళ్లతో దాడి చేశారని, విచక్షణారహితంగా దుర్భాషలాడారని వాపోయింది. అంతటితో ఆగకుండా చీర లాగి జాకెట్ చించారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తుంగోడు, కోనతొట్టి పల్లి గ్రామనికి చెందిన దాదాపు 200మంది.. మాజీ సర్పంచి నారాయణరెడ్డి, వాలంటీర్ ప్రతాపరెడ్డి, బాబు, మధుసూదన్ రెడ్డి తదితరులపై సోమందేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దళిత సంఘం దండు వీరయ్య వర్గం జిల్లా కార్యదర్శి జీకే ప్రకాష్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో సంబరాలు చేసుకోవడానికి ఎవరు అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. దళితులపై సర్పంచ్ అభ్యర్థులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గెలిచిన అభ్యర్థులు ఐదు సంవత్సరాలు ప్రజలకు న్యాయం చేయవలసింది పోయే ఈ దాడులు చేయడం దారుణమన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.