‘ఆంధ్రా గాంధీ’ వావిలాల

ABN , First Publish Date - 2022-09-17T07:07:44+05:30 IST

నీతినిజాయితీలకు నిలువుటద్దం... ఆయన. ఎనభై ఏళ్ళ పాటు జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన మహానుభావుడు.

‘ఆంధ్రా గాంధీ’ వావిలాల

నీతినిజాయితీలకు నిలువుటద్దం... ఆయన. ఎనభై ఏళ్ళ పాటు జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన మహానుభావుడు. రాజకీయాల విలువలకు పెద్దపీట వేసి, ప్రజాపోరాటాల్లో పాల్గొన్న చైతన్యశాలిగా గుర్తింపు పొందారు. ఆజన్మ బ్రహ్మచారి. అజాత శత్రువు. పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించి బ్రతికినంతకాలం ప్రజాసేవలో జీవించిన ధన్యజీవి పద్మభూషణ్‌ వావిలాల గోపాలకృష్ణయ్య. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ‘ఆంధ్రపత్రిక’కు ఉపసంపాదకుడిగా పనిచేసి పాత్రికేయునిగా వావిలాల తన వంతు పాత్ర పోషించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, ఉత్తమ శాసన సభ్యునిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, రాష్ట్ర తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఎనలేని కీర్తిని పొంది ఎందరికో ఆదర్శంగా, స్ఫూర్తిప్రదాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన జన్మదినమే తెలంగాణ విమోచన దినం కావడం ప్రత్యేకమో... కాకతాళీయమో.


ఆయన జీవితమే ఓ సందేశం. గాంధీజీ బొమ్మ ఉన్న ఒక ఖద్దరు సంచిలో రెండు జతల ఖద్దరు బట్టలు, సర్దుకుని నిత్యమూ ఏదో ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొన్న అసాధారణ వ్యక్తి. ఆయన్ని కొందరు ‘ఆంధ్రా గాంధీ’గా అభివర్ణిస్తారు. భౌతికంగా బక్కపలచని మనిషి... జీవితాంతం చెక్కుచెదరని ఆశయాలు. ప్రజాసేవే పరమావధి. అతిసాధారణ జీవనశైలి. ‘నాలుగుసార్లు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించినది ఈయనేనా?’ అని ఆశ్చర్యపోయేటంతటి మూర్తిమత్వం... సుదీర్ఘమైన ప్రజాజీవిత ప్రస్థానంలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. అందులో ‘విశాలాంధ్ర’ ఉద్యమం, ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ముఖ్యమైనవి. అన్నిటికన్నా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కోసం ఆయన చేసిన కృషి మరువరానిది. ప్రధాని నెహ్రూ చేత ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయించటంలో ఆయన కృషి అభినందనీయం. ఆ ప్రాజెక్ట్ వల్ల నల్గొండ–గుంటూరు జిల్లాలు ఇప్పుడు సుభిక్షంగా ఉన్నాయంటే, వావిలాలను నిత్యం స్మరించుకోవాలి. సాగర్ నేడు ఒక గొప్ప పర్యాటక ప్రాంతం.


1906 సెప్టెంబరు 17న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పేరిందేవి, నరసింహం దంపతులకు ఈయన నాలుగో సంతానంగా జన్మించారు. చదువుకునే రోజుల్లోనే గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితులై, చదువుకు స్వస్తి చెప్పారు. ఉద్యమాలలో పాల్గొని బ్రిటిష్ హయాంలో జైలుశిక్షలు అనుభవించారు. జీవితమంతా నిరాడంబరంగా గడిపారు. స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరైన భీమవరపు నరసింహారావుతో కలిసి గోపాలకృష్ణయ్య ఇంటింటికీ తిరిగి ‘స్వరాజ్య భిక్ష’ పేరుతో బియ్యం, జొన్నలు సేకరించారు. ఆ సేకరించిన ఆహార పదార్థాలతో కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన సదుపాయం కల్పించారు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు.


ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసిన యోధుడు. 1925లోనే సత్తెనపల్లిలో ‘శారదా నిలయం’ పేరిట గ్రంథాలయం నెలకొల్పటమే కాకుండా, గ్రంథాలయ ఉద్యమాలు చేసి, అనేక గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా, గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు 1952లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో పోటీచేసి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో వావిలాల ఖర్చుపెట్టింది కేవలం ఆరువందల రూపాయలు. 1955, 1962, 1967 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా సత్తెనపల్లి నుంచి స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థిగా గెలుపొందారు. జీవితాంతం గాంధేయవాదిగా కొనసాగిన ప్రకాశం పంతులుకి సన్నిహితుడు. ప్రకాశం పంతులు, బూర్గుల, పుచ్చలపల్లి సుందరయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గౌతు లచ్చన్న, తరిమెల నాగిరెడ్డి, వేములపల్లి శ్రీకృష్ణ, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు వంటి మహామహుల సరసన శాసనసభలో సభ్యునిగా వ్యవహరించిన వావిలాల స్పృశించని సమస్య లేదు. 


మరో ప్రముఖుడు తెన్నేటి విశ్వనాథంతో కలిసి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షనేతగా అనేక ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొన్నారు. చర్చల మధ్యలో ఎన్నో హాస్యోక్తులు కురిపించేవారు. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోజు శాసనసభలో ఒక తీవ్రమైన విషయంపై సుదీర్ఘ చర్చ జరుగుతున్నది. బ్రహ్మానందరెడ్డి అసహనంగా ‘‘గోపాలకృష్ణయ్య గారూ! మీరు చెబుతున్న విషయం అర్థవంతంగా లేదు. నేను ఒక చెవితో విని మరొక చెవితో వదిలి పెడుతున్నాను’’ అని అన్నారు. వెంటనే గోపాలకృష్ణయ్య ‘‘ముఖ్యమంత్రి గారు నేను చెప్పినదంతా ఒక చెవితో విని మరొక చెవితో వదిలి పెడుతున్నారంటే, నాకొక అనుమానం, ఆ రెండు చెవుల మధ్య ఉండవలసిన ‘బ్రహ్మ పదార్థం’ లేని వట్టి ‘ఆనందరెడ్డి’ గారేమో మన ముఖ్యమంత్రి’’ అని విసిరిన ఛలోక్తికి సభలోని అందరితోపాటు బ్రహ్మానందరెడ్డి కూడా నవ్వుకున్నారు.


విద్యాధికుడు కాదు, సామాన్యమైన మాధ్యమిక విద్యాలయంలో చదువుకున్న విద్యే! అయితేనే, అమోఘమైన ధారణ కలిగిన వ్యక్తి. తెలుగు, ఆంగ్ల భాషలలో అనేక గ్రంథాలు రచించిన ఈ మేధావి తెలుగువాడని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ సత్కారంతో గౌరవించి ప్రత్యేకతను నిలుపుకుంది. భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ బిరుదుతో సత్కరించింది.


ఎంతో మంది మేధావులు, విద్యావంతులు – విశ్వవిద్యాలయాలలో ఆయన ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వపు బడ్జెట్ ఉపన్యాసాలు’ వినటానికి కుతూహలపడేవారు. వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్ సంస్థని గుంటూరు అరండల్‌పేటలో ఏర్పాటు చేశారు. దానినే ‘వావిలాల సంస్థ’గా పిలుస్తుంటారు. అందులో గోపాలకృష్ణయ్య సేకరించిన వేలాది పుస్తకాలతో ఒక గ్రంథాలయం కూడా ఉన్నది. ఆయన తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు రాశారు. 1922లో తొలి రచన ‘శివాజీ’, 1947లో ‘మద్రాసు మంత్రివర్గమా ఎక్కడికి?’, 1951లో ‍‘విశాలాంధ్రం’, 1976–77 ‘ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయోద్యమం’.. మచ్చుకు కొన్ని.


1952లో శాంతి సభలలో ఆయన భారతదేశ ప్రతినిధిగా చైనాలో పర్యటించారు. 1952లోనే శాంతి సభలలో పాల్గొనే భారతదేశ ప్రతినిధిగా రష్యాలో పర్యటించారు. 1990లో మద్యనిషేధ ఉద్యమంలో పాల్గొన్నారు. 1992లో అమెరికాలో పర్యటించారు. ఖాదీ దుస్తులతో, చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా జీవితాంతం పోరాటాలు చేసిన యోధుడు, అపర భీష్ముడుగా భాసిల్లిన గోపాలకృష్ణయ్యని మృత్యువు 96 సంవత్సరాల వయసులో 2003 ఏప్రిల్ 9న ఓడించింది. భౌతికంగా విడిపోయినా, నాగార్జునసాగర్ నుంచి ప్రవహించే కృష్ణా జలతరంగాలలో ఆయన చిరునవ్వులు నిత్యం కనిపిస్తునే ఉంటాయి. అయితే ఆ మహనీయుని స్మారక చిహ్నాలు, ఒక ఉద్యానవనం సత్తెనపల్లిలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ వాగ్దానం కార్యరూపం దాల్చకుండా అలాగే మిగిలిపోయింది. వావిలాల గోపాలకృష్ణయ్య వంటి వేగుచుక్క కోసం తెలుగువారు ఎదురుచూస్తున్నారనడంలో సందేహం లేదు. 


నందిరాజు రాధాకృష్ణ

(నేడు వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి)

Updated Date - 2022-09-17T07:07:44+05:30 IST