'ఆంధ్ర కళా వేదిక' ఖతార్ వారి అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ వేడుక

ABN , First Publish Date - 2022-02-24T16:23:47+05:30 IST

తెలుగు భాషా అభివృద్ధి, పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని 'ఆంధ్ర కళా వేదిక' వారు ఈ నెల 21న(సోమవారం) ఐసీసీ అశోకా హాల్‌లో ఘనంగా జరిపారు.

'ఆంధ్ర కళా వేదిక' ఖతార్ వారి అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ వేడుక

ఖతార్: తెలుగు భాషా అభివృద్ధి, పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని 'ఆంధ్ర కళా వేదిక' వారు ఈ నెల 21న(సోమవారం) ఐసీసీ అశోకా హాల్‌లో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ ప్రెసిడెంట్ పీఎన్ బాబు రాజన్, జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ కేఎస్ ప్రసాద్, ఐసీబీఎఫ్ నుంచి రజనీ మూర్తి వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు ఇతర ప్రముఖ తెలుగు సంఘాల అధ్యక్షులు, వారి కార్యవర్గ బృందం సభ్యులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తునందుకు గాను ఆంధ్ర కళా వేదిక కార్యనిర్వాహక వర్గాన్ని అభినందించారు.


ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఖతార్‌లోని తెలుగు వారి నుండి అపూర్వమైన స్పందన లభించిందన్నారు. తెలుగు వారందరిలో మాతృభాష పట్ల అభిమానాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో తమ కార్యవర్గ బృందం చేసిన కృషి ఫలించిందని పేర్కొన్నారు. యువత, పెద్దలలో మాతృ భాష పట్ల స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసే విధంగా మూడు రోజుల ముందు నుంచి అందరికి పోటీలు(చిట్టి గీతాలు, పద్యాలు, శతకాలు, ప్రముఖ వ్యక్తుల పై ప్రసంగాలు, సామెత సమేత కధలు మొదలుగునవి..) నిర్వహించటం జరిగిందని తెలిపారు. ఈ పోటీలలో రెండున్నరేళ్ల చిన్నారుల నుంచి 65 సంవత్సరాల వయసు గల పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఉత్సాహవంతంగా మలిచారని చెప్పారు.


ఈ కార్యక్రమంలో చిన్నారుల అద్భుతమైన ప్రదర్శనలు(ఏకపాత్రాభినయం, నృత్యాలు, పాటలు) అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగు భాషా బోధించే ఉపాధ్యాయులను, న్యాయనిర్ణేతలను వేదికపై సన్మానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోటీలలో విజేతలకు, పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శిరీష, శ్రీ సుధ వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశంతో కార్యక్రమం ముగించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన దాతలకు(స్పాన్సర్స్), న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు, స్వచ్ఛంద సేవకులకు(వాలంటీర్స్), ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.    

Updated Date - 2022-02-24T16:23:47+05:30 IST