కావాల్సింది నగదు బదిలీ కాదు అధికారాల బదిలీ
ABN , First Publish Date - 2022-06-18T05:51:48+05:30 IST
కనీస మౌలిక వసతులు నాగరికతకు చిహ్నాలు. కానీ మన రాష్ట్రంలో వీధి దీపాలు, సైడు కాల్వలు, సరైన డ్రైనేజీ వ్యవస్థ, సక్రమమైన రోడ్లు లేని గ్రామాలు కోకొల్లలు.
కనీస మౌలిక వసతులు నాగరికతకు చిహ్నాలు. కానీ మన రాష్ట్రంలో వీధి దీపాలు, సైడు కాల్వలు, సరైన డ్రైనేజీ వ్యవస్థ, సక్రమమైన రోడ్లు లేని గ్రామాలు కోకొల్లలు. దీనికి ప్రధాన కారణం స్థానిక సంస్థల పరిధిలో వసూలు చేస్తున్న పన్నులు, పంచాయతీలకు కేంద్రం విడుదల చేస్తున్న నిధులు, నరేగా నిధులు వంటివి దారి మళ్ళి అనుత్పాదక వ్యయాలుగా మారడం. కనీసం నగరాల్లోనైనా పరిస్థితి సౌకర్యవంతంగా లేదు. ఆధునిక భారతంలో నగరాలే ఉపాధి కేంద్రాలుగా ఉంటున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోని నగరాలు మాత్రం అందుకు భిన్నంగా ఉపాధి కల్పనలో వెనుకబడి ఉన్నాయి.
సమాజంలోని నిర్దిష్ట వర్గాలకు సంవత్సరానికి ఇంతని నిర్దిష్ట మొత్తాలను నగదు రూపంలో బదిలీ చేయడమే సర్వరోగనివారిణిగా భావిస్తూ, ప్రజలనూ భ్రమింపజేయజూస్తున్న ఏలికల ఏలుబడిలో సర్వతోముఖాభివృద్ధిని ఆశించడం అత్యాశే అవుతుంది. పరిపాలనా వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలు చేసి మూలలకు విసిరేయడమే అని భావించే పాలకులకు ఎమ్ఎన్ రాయ్ వంటి మేధావులు ప్రతిపాదించిన పార్టీలకతీతంగా ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో నడిచే స్థానిక పరిపాలన అర్థమవుతుందనుకోవడం అవివేకమే అవుతుంది. స్థానిక పరిపాలన సజావుగా సాగేలా ప్రగతిశీల వ్యవస్థలు, శక్తులు కార్యోన్ముఖులు కావలసిన తరుణం ఆసన్నమైంది. స్థానిక సంస్థల నిధులపై కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వమే అజమాయిషీ చేసే విధానానికి స్వస్తి పలకాలి. ప్రజలే తమ భవితవ్యాన్ని నిర్దేశించుకోగలగాలి. అందుకు తోడ్పడే నాయకత్వాన్ని ఎంచుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్య ఫలాలను ప్రజలు అనుభవించగలుగుతారు.
– కుమార్ బాబు