ఏపీలో టెన్త్ హిందీ పేపర్ లీక్

ABN , First Publish Date - 2022-04-28T21:07:03+05:30 IST

అమరావతి: ఏపీలో టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ పర్వం కొనసాగుతోంది.

ఏపీలో టెన్త్ హిందీ పేపర్ లీక్

అమరావతి: ఏపీలో టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ పర్వం కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకేజీ కలకలం రేపుతోంది. సరుబుజ్జిలి మండలంలోని రొట్ట వలస, సలంత్రీ పరీక్షా కేంద్రాల నుంచి హిందీ పేపర్ బయటకు వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.


కాగా నిన్న పలు కేంద్రాల్లో తెలుగు పరీక్షా పత్రం లీక్ అయింది. అయితే ఇది పేపర్ లీక్ కాదని, మాల్ ప్రాక్టీస్ అని విద్యాశాఖ అధికారులు సర్దిచెప్పారు. ఘటనకు సంబంధించిన వారిని అరెస్టు చేశామని సింపుల్‌గా తేల్చేశారు. అయితే ఒక్కచోట పేపర్ లీక్ అయితే ఏదో పొరపాటు అనుకోవచ్చు. కానీ అనేక చోట్ల ఒకేసారి పేపర్ లీక్ కావడాన్ని పొరపాటుగా చూడలేమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


నిన్నటి ఘటనతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ గురువారం హిందీ పేపర్ బయటకు రావడం చర్చనీయాశంమవుతోంది. అధికారుల బాధ్యతా రాహిత్యంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసపెట్టి ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతుండడంతో కష్టపడి చదివిన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఇలాంటి ఘటనలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరల ఇవాళ హిందీ పేపర్ బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ లీకేజీ పర్వానికి ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-04-28T21:07:03+05:30 IST