AP ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రాణాలు తీసే విష పదార్థాలు: TDP
ABN , First Publish Date - 2022-06-25T20:09:44+05:30 IST
ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు.
అమరావతి (Amaravathi): ఏపీ ప్రభుత్వ (AP Govt.) మద్యం దుకాణాల్లో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయని, మద్యం తాగుతున్న వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని టీడీపీ నేతలు (TDP Leaders) ఆరోపించారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల్లో మందు బాటిల్స్ను సేకరించి టెస్టులు చేయించామని, ఆంధ్రా గోల్డ్ విస్కీ, 9సీ హార్స్ విస్కీలో కెమికల్ కాపౌండ్స్ ఉన్నాయని ఆరోపించారు. వైరాగేలా, ఐసోప్లురిక్ యాసిడ్ కెమికల్ కాపౌండ్స్ ఉన్నాయన్నారు. ఆ మద్యం బాటిల్స్లో హానికర కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయని, ల్యాబ్ స్పష్టంగా నివేదిక ఇచ్చిందన్నారు. వాటిలో ఎలాంటి ప్రాణహాని లేదంటూ ప్రభుత్వం ఇచ్చిన వివరణ వట్టి బూటకమన్నారు. అలాంటి విష పదార్ధాలు లేవని ప్రభుత్వం నిరూపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramanareddy) మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం కాదు.. సారాయి ఏరులే పారుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ (Jagan) పాదయాత్రలో ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని, లోడ్ లారీ పట్టుకుంటే ఇద్దరు సేల్స్మెన్లను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. కేసు నీరుగార్చడానికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మందుబాబులను కూడా తాకట్టు పెట్టిన సీఎం ఎక్కడైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. మద్యంపై ఆదాయాలన్ని చూపి రూ. 35 వేల కోట్లు అప్పు తెచ్చారన్నారు. టీడీపీ హయాంలో రాజధాని అభివృద్ధికి రూ. 2 వేల కోట్లు బాండ్లు తీసుకువస్తే విమర్శించిన జగన్.. నేడు మద్యంపై ఆదాయం చూపి రూ.35 వేల కోట్లు బాండ్లు తెస్తారా? అంటూ ఆనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.