YCP Plenaryకి బస్సులు పంపాలంటూ విద్యాసంస్థల యాజమాన్యాలపై అధికారుల ఒత్తిడి
ABN , First Publish Date - 2022-07-06T18:26:25+05:30 IST
వైసీపీ ప్లీనరీ కోసం బస్సులు పంపాలంటూ విద్యా సంస్థలపై ఏపీ రవాణాశాఖ అధికారుల ఒత్తిడి..
అమరావతి (Amaravathi): వైసీపీ ప్లీనరీ (YCP Plenary) కోసం బస్సులు పంపాలంటూ విద్యాసంస్థలపై ఏపీ రవాణాశాఖ అధికారులు (AP Transport officials) ఒత్తిడి చేస్తున్నారు. ప్లీనరీకి బస్సులు పంపాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రైవేటు (Private), కార్పొరేటు స్కూళ్లు (Corporate schools), ఇంజనీరింగ్ (Engineering) కళాశాలలకు హుకూం జారీ చేసింది. పాఠశాలలు తెరిచామని, పరీక్షలు జరుగుతున్నాయని చెప్పినా అధికారులు వినిపించుకోవడం లేదు. అవసరమైతే సెలవులు ఇవ్వాలంటూ అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. గతంలో టీడీపీ మహానాడుకు బస్సులు ఇస్తే ఊరుకోమని ఆయా యాజమాన్యాలను రవాణాశాఖ అధికారులు బెదిరించారు. ఇప్పుడు వైసీపీ ప్లీనరీకి బస్సులు ఎలా అడుగుతున్నారని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. బస్సులు ఇవ్వని పక్షంలో రెన్యువల్కు వచ్చినప్పుడు మీ సంగతి చూస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం వివాదంగా మారింది. స్కూల్, కాలేజీ అవసరాలకు మినహా ఇతర అవసరాల కోసం... బస్సులు ఉపయోగించవద్దని గతంలో రవాణా శాఖ అధికారులు బాండ్లు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా యాజమాన్యాలు గుర్తు చేశాయి. కాగా ఈ నెల 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.