ఇంకో 20 ఏళ్లలో KTR ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యంలేదు.. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌కు గుర్తుండిపోయే ప్రశంస

ABN , First Publish Date - 2022-05-25T00:39:31+05:30 IST

వాక్చాతుర్యంతో స్రోతలను మంత్రముగ్దులను చేయగల నేర్పు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. తెలుగు రాష్ట్రాల్లో చక్కటి వాగ్దాటి కలిగిన అ

ఇంకో 20 ఏళ్లలో KTR ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యంలేదు.. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌కు గుర్తుండిపోయే ప్రశంస

దావోస్ : వాక్చాతుర్యంతో శ్రోతలను మంత్రముగ్దులను చేయగల నేర్పు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. తెలుగు రాష్ట్రాల్లో చక్కటి వాగ్దాటి కలిగిన అతికొద్ది మంది రాజకీయ నేతల్లో ఆయన కూడా ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయ ప్రసంగాలే కాకుండా ఎన్నో అంతర్జాతీయ స్థాయి వ్యాపార, వాణిజ్య సదస్సుల్లోనూ ప్రసంగించి తనదైన శైలిలో ఫిదా చేశారు. తాజాగా మరో అంతర్జాతీయ వేదికపై తన ప్రసంగానికి ఎంతటి ఆకర్షణీయత ఉందో ఆయన చాటిచెప్పుకున్నారు. 


దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ సారధ్యంలోని తెలంగాణ బృందం దూసుకెళ్తోంది. ఇన్వెస్టర్లతో వరుస సమావేశాలు, రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య అనుకూల పరిస్థితులను ఇన్వెస్టర్లకు వివరించడంలో మంత్రి కేటీఆర్ బృందం తన కార్యదక్షతను చాటుకుంటోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. స్పష్టమైన లక్ష్యంతో కూడిన తన ఆలోచనను ఇన్వెస్టర్లకు తెలియజేయడంతో సఫలీకృతమవుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ పనితీరుని గమనించిన ఆశా జడేజా మెత్వాణీ అనే ఓ ఏంజెల్ ఇన్వెస్టర్ నుంచి ఆయనకు గుర్తుండిపోయే ప్రశంస ఇచ్చారు. ఇంకో 20 ఏళ్లలో కేటీఆర్ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని ఆశా జడేజా మెత్వాణీ వ్యాఖ్యానించారు. సుస్పష్టమైన లక్ష్యం, దానిని అర్థంచేసుకునేలా వ్యక్తీకరించగల నేర్పు ఉన్న ఇలాంటి యువ రాజకీయనాయకుడిని తాను చూడలేదని ఆమె పొగిడారు. తెలంగాణ బృందం అద్భుతంగా రాణిస్తోందని ఆమె మెచ్చుకున్నారు. సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులను గుర్తుచేశారని ప్రస్తావించారు. భవిష్యత్‌లో బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-05-25T00:39:31+05:30 IST