పీటలపై ఆగిన పెళ్లి...పెళ్లికి నో చెప్పిన వధువు

ABN , First Publish Date - 2022-01-28T17:58:43+05:30 IST

వివాహ వేడుకలో వరుడు చేసిన చిన్న పొరపాటు వల్ల తాను అతన్ని పెళ్లి చేసుకోనని వధువు తెగేసి చెప్పిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది....

పీటలపై ఆగిన పెళ్లి...పెళ్లికి నో చెప్పిన వధువు

వరుడు పూలదండ విసిరేశాడనే కోపంతో పెళ్లికి నిరాకరించిన వధువు

లక్నో (ఉత్తరప్రదేశ్): వివాహ వేడుకలో వరుడు చేసిన చిన్న పొరపాటు వల్ల తాను అతన్ని పెళ్లి చేసుకోనని వధువు తెగేసి చెప్పిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. వరమాల వేడుకలో వరుడు పూలదండ విసిరివేయడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరయ్యా జిల్లాలోని బిదునా కొత్వాలి పట్టణం నవీన్ బస్తీలో వెలుగుచూసింది. ఔరయ్యా జిల్లాకు చెందిన వధూవరులు పెళ్లి చేసుకునేందుకు పెళ్లి పందిరి వద్దకు వచ్చారు. సంప్రదాయ బద్ధంగా జరగాల్సిన వరమాల వేడుకలో వరుడు పూలదండను విసిరివేశాడు. అంతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు వరుడిని పెళ్లాడేందుకు నిరాకరించింది.పెళ్లికూతురి నిర్ణయంతో పెళ్లికి వచ్చిన అతిథులు షాక్ కు గురయ్యారు.


 ఈ ఘటనతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.పెళ్లికి వధువును ఒప్పించేందుకు పెళ్లి పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఈ ఘటన జరిగినపుడు వరుడి కుటుంబీకులు భోజనం చేసేందుకు పెళ్లి పందిరి వద్ద నుంచి బయటకు వెళ్లారు. కాగా తాను పూలదండను విసిరి కొట్టలేదని వరుడు ఆకాష్ వివరణ ఇచ్చినా, పెళ్లి చేసుకునేందుకు మాత్రం వధువు ససేమిరా అని చెప్పేసింది. దీంతో పెళ్లి వేడుక కాస్తా ఆగిపోయింది.


Updated Date - 2022-01-28T17:58:43+05:30 IST