బాబు నిర్బంధంపై టీడీపీ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-03-02T07:04:48+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు నిర్బంధించటంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబు నిర్బంధంపై టీడీపీ ఆగ్రహం

జిల్లావ్యాప్తంగా తమ్ముళ్ల ఆందోళనలు

ముఖ్యమంత్రి, పోలీసుల తీరుపై మండిపాటు

అనంతపురం వైద్యం, మార్చి1: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు నిర్బంధించటంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పెనుకొండలో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారధి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవటానికి ప్రయత్నించగా.. తమ్ముళ్లు తీవ్రంగా ఎదురించారు. దీంతో పోలీసులు.. బీకే, సవితతోపాటు తమ్ముళ్లను అరెస్టు చేసి, తీసుకెళ్లారు. కళ్యాణదుర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు నేతృత్వంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తమ్ముళ్లతో కలిసి, ఆందోళన చేపట్టారు. కదిరిలో ఇన్‌చార్జ్‌ కందికుంట ప్రసాద్‌ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌, గుత్తిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ ఆధ్వర్యంలో రోడుపై బైఠాయించి, తమ్ముళ్లు ఆందోళన సాగించారు. పుట్టపర్తి, మడకశిర, హిందూపురం, రాయదుర్గం, రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు రాష్ట్ర కార్యదర్శులు.. తమ్ముళ్లతో కలిసి, నిరసనలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్‌ నియంత పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాసంక్షేమాన్ని వదిలేసి, కక్ష సాధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారనీ, తగిన సమయంలో బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు హెచ్చరించారు.

Updated Date - 2021-03-02T07:04:48+05:30 IST