Rottela Panduga: బారాషహీద్ దర్గాలో ఘనంగా గంధమహోత్సవం
ABN , First Publish Date - 2022-08-11T12:19:05+05:30 IST
బారాషహీద్ దర్గాలో ఘనంగా గంధమహోత్సవం నిర్వహించారు. కడప పీఠాధిపతి ఖాజా సయ్యద్ షా ఆరిఫ్ఫల్లా దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు
నెల్లూరు: బారాషహీద్ దర్గాలో ఘనంగా గంధమహోత్సవం నిర్వహించారు. కడప పీఠాధిపతి ఖాజా సయ్యద్ షా ఆరిఫ్ఫల్లా దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు, పూజలు నిర్వహించారు. గతంతో పోలిస్తే అతి తక్కువ సంఖ్యలో భక్తులు (Devotees) హాజరయ్యారు. ఉత్సవంలో ఎమ్మెల్యేలు అనిల్కుమార్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (MLAs Anil Kumar Kotam Reddy Sridhar Reddy) పాల్గొన్నారు. రొట్టెల పండుగ (Rottela Panduga)కు నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర ఉంది. ‘స్వర్ణాల తీరంలో బారాషహీద్ దర్గాలో అమరులైన షహీదులను నమ్మిన వారి కోరికలు తీర్చే దర్గాగా ప్రతి ఏటా గంథమహోత్సవం - రొట్టెల పండుగ ప్రసిద్ధికెక్కింది. దేశం నలుమూలల నుంచేగాక విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడంతో 2015లో దీనిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది.
ఆచారం..
కుల, మతాలకు అతీతంగా భక్తులు తమ కోరికలు తీరాలంటే రొట్టెలు పంచాలి. కోరికలు తీరినవారు మరుసటి సంవత్సరం ఇక్కడ రొట్టెలు వదలాలి ఇదీ ఈ పండుగ ఆచారం. తొలుత ఈ రొట్టెల మార్పిడి కేవలం మహిళలకే పరిమితమైంది. తొలుత సంతానం, వివాహం, ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని రొట్టెలు పట్టుకునేవారు - వదిలేవారు. ఆ తర్వాత కాలక్రమేణా అన్ని వయస్సుల వారు, ఏ కులం, మతం వారైనా ఆనందంగా కోర్కెల రొట్టెలు పట్టుకోవడం, వదలడం భక్తిశ్రద్ధలతో చేయడంతో రొట్టెల పండుగ విశ్వవ్యాప్తమైంది. వివాహం, సంతానం, ఆరోగ్యం, సౌభాగ్యం, ఉద్యోగం, పదోన్నతి, గృహ, రుణం, విదేశీయానం, విదేశీవిద్య, తదితర 18 రకాల రొట్టెలను వదలడం, పట్టుకోవడం జరుగుతోంది.