గ్రేటర్‌లో ఇక త్వరలో జంతు దహన వాటికలు..

ABN , First Publish Date - 2021-12-08T17:05:17+05:30 IST

త్వరలో జంతువుల దహన వాటికలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు...

గ్రేటర్‌లో ఇక త్వరలో జంతు దహన వాటికలు..

  • ఒక్కో దహనానికి రూ.2,500
  • రెండు ప్రాంతాల్లో ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ : త్వరలో జంతువుల దహన వాటికలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి సంస్థల ఎంపికను జీహెచ్‌ఎంసీ పూర్తి చేసింది. ఎల్‌బీనగర్‌ జోన్‌లోని ఫతుల్లగూడ, కూకట్‌పల్లి జోన్‌లోని మహదేవపుర యానిమల్‌ కేర్‌ సెంటర్లలో జంతు దహన వాటికలను ఏర్పాటు చేయనున్నారు. పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌, రాగ ఫౌండేషన్‌లకు ఈ బాధ్యతలను అప్పగించారు. యంత్రాలు, విద్యుత్‌ సరఫరా, సిబ్బందిని సమకూర్చుకోవడంతో పాటు, నిర్వహణ కూడా ఆయా సంస్థలదే. ఒక్కో జంతువు దహనానికి రూ.2500 వసూలు చేస్తారని ఓ అధికారి చెప్పారు. 

పెంపుడు కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులను ఇక్కడ దహనం చేయనున్నారు. వీధి కుక్కలు, రోడ్లపై చనిపోయే ఇతర జంతువుల దహనానికి జీహెచ్‌ఎంసీయే ఖర్చులు భరించే అవకాశముంది. దీనికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను స్టాండింగ్‌ కమిటీ ఆమోదం కోసం ఎజెండాలో పెట్టారు. చనిపోయిన జంతువులను రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. దీంతో దుర్వాసన రావడంతోపాటు ప్రజారోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. దీనికి చెక్‌ పెట్టేందుకే దహన వాటికల ఏర్పాటు నిర్ణయమని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.

Updated Date - 2021-12-08T17:05:17+05:30 IST