ఇబ్రహీంపట్నంలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం
ABN , First Publish Date - 2022-06-28T04:48:58+05:30 IST
ఇబ్రహీంపట్నంలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం
- హిందూ సంఘాల ఆందోళన
ఇబ్రహీంపట్నం, జూన్ 27: ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం టౌన్లోని శ్రీ ఈశ్వరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి విగ్రహం, తులసీకోటను గుర్తుతెలియని దుండగులు సోమవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. ఉదయం పూజారి, భక్తులు ఆలయానికి వచ్చి తలుపులు తీయడంతోనే ఈవిషయం తెలిసింది. దీంతో వీహెచ్పీ, ఆర్ఎ్సఎ్సతోపాటు పలువురు బీజేపీ నాయకులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. టౌన్లో ర్యాలీ నిర్వహించారు. కాగా ఘటనాస్థలాన్ని ఏసీపీ ఉమామహేశ్వర్రావు, సీఐ సైదులు సందర్శించారు. దుండగులెవరైనా విచారణచేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కట్టమైసమ్మ ఆలయం వద్ద అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని, శివాజీ విగ్రహానికి ఉన్న ఖడ్గాన్ని ధ్వంసం చేశారని కొందరు కావాలనే ఈ ఘటనలకు పాల్పడుతున్నారంటూ నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నిరసనలో హిందూ సంఘాల నాయకులు బుగ్గరవరుపు రమేష్, సూరంపల్లి కాళిదాసు, బీజేపీ కౌన్సిలర్లు ముత్యాల భాస్కర్, నాయిని సత్యనారాయణ తదితరులున్నారు.