రెండాకుల గుర్తును స్తంభింపజేయాలని కేసు
ABN , First Publish Date - 2022-07-08T14:54:48+05:30 IST
అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తును స్తంభింపజేయాలని కోరుతూ కేసు దాఖలు చేసిన పిటిషనర్కు హైకోర్టు రూ.25 వేల జరిమాన
- పిటిషనర్కు రూ.25వేల జరిమాన
చెన్నై, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తును స్తంభింపజేయాలని కోరుతూ కేసు దాఖలు చేసిన పిటిషనర్కు హైకోర్టు రూ.25 వేల జరిమాన విధించింది. తగిన కారణాలు లేకుండా ప్రచారం కోసం కేసు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నాడీఎంకే మాజీ సభ్యుడు జేజే పార్టీ వ్యవస్థాపకుడు పీఏ జోసెఫ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని పొందటం కోసం రూ.5వేల కోట్ల వరకూ ఖర్చుపెట్టారని,ఈనెల 11న జరుగనున్న సర్వసభ్యమండలిలో మద్దతు సమీకరణ కోసం రూ.1000 కోట్లను ఖర్చుపెడుతున్నారని వార్తలు వెలువడుతున్నాయని, అవన్నీ అవాస్తవాలనీ ఆయన ఖండించలేదని పిటిషనర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాను అన్నాడీఎంకే చిహ్నం రెండాకులను స్తంభింపజేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి గత జూన్ 28న వినతిపత్రం సమర్పించినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్నాధ్ భండారి, న్యాయమూర్తి ఎన్ మాలాతో కూడిన ప్రథమ ధర్మాసనం ఎదుట గురువారం ఉదయం విచారణకు వచ్చింది. పత్రికలలో వచ్చిన వార్తలను ఉటంకించి పిటిషనర్ స్వీయ ప్రచారం కోసం కేసు వేసినట్లు స్పష్టమవుతోందని ఆగ్రమం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పిటిషనర్కు రూ.25 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వు జారీ చేసి పిటిషన్ను తోసిపుచ్చింది.