పేద రైతులకు ఇళ్లు

ABN , First Publish Date - 2021-01-22T14:01:24+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేద రైతులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆ పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి

పేద రైతులకు  ఇళ్లు

ప్రచార సభలో ఎడప్పాడి ప్రకటన

మేం తలచుకుంటే మీరు బయట తిరగలేరు

డీఎంకేకు హెచ్చరిక


చెన్నై,(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేద రైతులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆ పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో బుధవారం ఎన్నికల ప్రచార పర్యటన జరిపిన ఎడప్పాడి గురువారం ఉదయం తిరుప్పోరూర్‌ బస్టాండు సమీపంలో రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రతి ప్రచారసభలోనూ తనను రైతు బిడ్డ అంటూ పదే పదే యెద్దేవా చేస్తున్నారని, రైతు బిడ్డ అంటే ఎందుకింత ఆగ్రహం చెందుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. బురేవి, నివర్‌ తుఫాను వర్షాలవల్ల పంటలను నష్టపోయిన రైతులకు నిధుల మంజూరు చేయించడం కోసం తాను ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని మోదీని కలుసుకోవడాన్ని కూడా స్టాలిన్‌ విమర్శిస్తూ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆ ఇరువురినీ కలిసినట్టు చెప్పడం వింతగా ఉందన్నారు.  తాను ఢిల్లీ వెళ్ళింది రైతుల సాయం కోసం నిధులు విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకేనని స్పష్టం చేశారు.  నిస్వార్థపరులైన నాయకులు కలిగిన పార్టీ తమదేనని ఎడప్పాడి చెప్పారు. 

గ్రామసభల్లో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తమ పార్టీ కార్యకర్తల ద్వారా అన్నాడీఎంకేను, నేతలను కించపరిచేవిధంగా తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఎడప్పాడి ధ్వజమెత్తారు. ఇదే రీతిలో స్టాలిన్‌ గ్రామసభలు కొనసాగితే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని, తాము తలచుకుంటే డీఎంకే నేతలెవరూ బయట తిరుగలేని పరిస్థితులు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2021-01-22T14:01:24+05:30 IST