ఆరోగ్యమిత్రలుగా ఏఎన్ఎంలు
ABN , First Publish Date - 2021-08-03T05:14:19+05:30 IST
సచివాలయ ఆరోగ్య సెక్రటరీలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలను ఆరోగ్య మిత్రలుగా మార్పు చేశారు. వీరికి త్వరలోనే ఏప్రాన్ (తెల్ల కోట్లు)లను అందజేయనున్నారు. సచివాలయ పరిధిలోని గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎం)లు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు వీరికి సంబంధిత పీహెచ్సీ పరంగా విధులు నిర్వహించినా జీతం, హాజరు (బయోమెట్రిక్) సచివాలయాల్లోనే. గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లాలి.
కొమరాడ, ఆగస్టు 2 : సచివాలయ ఆరోగ్య సెక్రటరీలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలను ఆరోగ్య మిత్రలుగా మార్పు చేశారు. వీరికి త్వరలోనే ఏప్రాన్ (తెల్ల కోట్లు)లను అందజేయనున్నారు. సచివాలయ పరిధిలోని గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎం)లు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు వీరికి సంబంధిత పీహెచ్సీ పరంగా విధులు నిర్వహించినా జీతం, హాజరు (బయోమెట్రిక్) సచివాలయాల్లోనే. గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లాలి. గర్భవతులను గుర్తించాలి. రెండో నెల నుంచి ప్రసవించే వరకు వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా ఇవ్వాలి. సచివాలయాలు ఏర్పడిన నాటి నుంచి వైద్యులు సూచించిన ప్రతి పనినీ వీరు చేస్తూ వస్తున్నారు. సచివాలయ అధికారులు పిలిచినప్పుడు అక్కడికి వెళ్లాలి. ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం తీసుకురావడంతో ఉదయం, సాయంత్రం సమయానికి బయోమెట్రిక్ వేసి తీరాల్సిందే. కరోనా వచ్చిన తరువాత ఉదయం కరోనా టెస్టులు చేయడం, కొవిడ్ వ్యాక్సినేషన్, డ్రైడే, గర్భిణులు.. బాలింతల సంరక్షణ తదితర కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం నిర్వహించే జూమ్ సమావేశాలకు సైతం తప్పనిసరిగా హాజరవుతున్నారు. ఈ విధులకు తోడుగా ఆరోగ్య మిత్రలుగా అదనపు బాధ్యతలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు, ఆరోగ్య మిత్ర డ్రెస్కోడ్తో 538 ఏప్రాన్లను పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ అప్పలరాజు తెలిపారు.