మరో 23,338 మందికి వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-01-22T09:28:08+05:30 IST
రాష్ట్రంలో ఆరో రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. గురువారం రాష్ట్రంలో ఎక్కడా లబ్ధిదారులకు అనారోగ్య సమస్యలు తలెత్తలేదు.
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరో రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. గురువారం రాష్ట్రంలో ఎక్కడా లబ్ధిదారులకు అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. ఆరో రోజు 616 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 23,338 మందికి వ్యాక్సిన్ వేసింది.
తొలిసారి కొవాగ్జిన్..
రాష్ట్రానికి కొవిషీల్డ్తో పాటు కొవాగ్జిన్ వ్యాక్సిన్ను కూడా కేంద్ర ప్రభుత్వం అందించింది. భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ 20 వేల డోసులను ఏపీకి సరఫరా చేయగా.. ఆ మొత్తం డోసులను ఆరోగ్యశాఖ గన్నవరంలోనే స్టోర్ చేసింది. గురువారం తొలిసారిగా వాటిని ఉపయోగించింది. కొవాగ్జిన్ డోసులు మొత్తం కృష్ణా జిల్లాలోనే ఉండడంతో తొలిసారి వాటిని ఆ జిల్లాలో పలువురికి అందించింది.
కొత్తగా 139 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 49,483 మం దికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు గురువారంఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా మరో 254 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 8,86, 557 కరోనా కేసులు నమోదవగా, వారిలో 8,77,893 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గురువారం రాష్ట్రంలో కరోనా మరణాలేమీ నమోదుకాలేదు.