రేపటి నుంచి మరో 300 పడకలు
ABN , First Publish Date - 2021-05-09T05:11:35+05:30 IST
విశాఖపట్నంలో కరోనా రోగుల కోసం మరో 300 పడకలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
షీలానగర్లో చకచకా ఏర్పాట్లు
విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో కరోనా రోగుల కోసం మరో 300 పడకలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు షీలానగర్లోని వికాస్ కాలేజీలో జరుగుతున్నాయి. నగరంలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుండటం, అందుకు తగిన సంఖ్యలో ఆస్పత్రుల్లో పడకలు లభించకపోవడంతో ఎంపీ విజయ సాయిరెడ్డి తాత్కాలిక పడకల ఏర్పాటుపై దృష్టి సారించారు. తన ప్రగతి భారతి చారిటబుల్ ట్రస్టు తరఫున నగరంలోని దాతల సాయంతో ఇక్కడ అన్నీ సమకూరుస్తున్నారు. కరోనా రోగులకు ఆక్సిజన్ పడకలు ఇక్కడ లభిస్తాయి. 104కి ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకున్న కొవిడ్ పాజిటివ్ బాధితులకు మాత్రమే ఇక్కడ పడకలు కేటాయిస్తారు. ఇక్కడి ఏర్పాట్లను శనివారం సాయంత్రం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయ సాయిరెడ్డి పరిశీలించారు. జీవీఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అన్ని అంశాలపై చర్చించారు.