student dead in TamilNadu : తమిళనాడులో మరో విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
ABN , First Publish Date - 2022-07-25T22:31:07+05:30 IST
కల్లకురిచ్చి స్కూల్ విద్యార్థి మరణం, అనంతరం హింసాత్మక నిరసనల ఘటన మరువక ముందే తమిళనాడులో (Tamilnadu) మరో విద్యార్థి(Student) మృతి చెందిన ఘటన వెలుగుచూసింది.
చెన్నై : కల్లకురిచ్చి స్కూల్ విద్యార్థి మరణం, అనంతరం హింసాత్మక నిరసన ఘటన మరువక ముందే తమిళనాడులో (Tamilnadu) మరో విద్యార్థి(Student) మృతి ఘటన వెలుగుచూసింది. తిరువల్లూరు(Tiruvallur) జిల్లాలోని కిలాచెరి సమీపంలోని బాలికోన్నత సెకండరీ స్కూల్లో 12వ తరగతి విద్యార్థిని మృతదేహాన్ని హాస్టల్ రూంలో సోమవారం ఉదయం గుర్తించారు. తిరుట్టనికి చెందిన 17 ఏళ్ల బాలిక అనుబంధ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. అయితే సోమవారం స్కూల్కి హాజరుకాలేదు. దీంతో అనుమానం వచ్చిన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి తనిఖీలు చేస్తుండగా హాస్టల్ గదిలో పడిపోయి ఉన్న బాలికను గుర్తించారు. తక్షణమే సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. కానీ బాలిక అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
పోస్టుమార్టం నిమిత్తం ఆమె బాలిక మృతదేహాన్ని తిరువల్లూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు తిరుట్టని-పొతుట్టర్పెట్టయ్ రోడ్డును బ్లాక్ చేశారు. బాలిక మృతికి గల కారణాలు ఏంటో స్కూల్ యాజమాన్యం తమకు చెప్పడం లేదంటూ నిరసన చేపట్టారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బాలిక చదువుకుంటున్న స్కూల్, ఆమె సొంత పట్టణం తిరుట్టనిలో పోలీసులను మోహరించారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టినట్టు తిరువల్లూర్ ఎస్పీ సెఫాస్ కల్యాణ్ తెలిపారు. బాలిక మరణంపై దర్యాప్తు చేపడతామన్నారు.