Good News : హైదరాబాద్లో మరో ఫ్లై ఓవర్.. ఇక ట్రాఫిక్ జామ్లకు చెక్.. ఇదే మొదటిది..
ABN , First Publish Date - 2022-05-10T15:26:49+05:30 IST
Good News : హైదరాబాద్లో మరో ఫ్లై ఓవర్.. ఇక ట్రాఫిక్ జామ్లకు చెక్.. ఇదే మొదటిది..
- బాచుపల్లిలో ఫ్లై ఓవర్
- రూ.141 కోట్లతో హెచ్ఎండీఏ టెండర్
- రెండేళ్లలో అందుబాటులోకి
- శివారు కార్పొరేషన్లలో ఇదే మొదటిది
హైదరాబాద్ సిటీ : బాచుపల్లి జంక్షన్లో ట్రాఫిక్ జామ్లకు చెక్ పడనుంది. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ (Fly Over) రానుంది. దాంతో పాటు, బాచుపల్లి నుంచి బౌరంపేట వరకు, బహదూర్పల్లి నుంచి కొంపల్లి వరకు రోడ్ల విస్తరణను కూడా ఏకకాలంలోనే హెచ్ఎండీఏ (HMDA) చేపట్టనుంది. రూ.141 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల చివరిలోగా టెండర్లను పూర్తి చేసి రెండేళ్లలో బాచుపల్లి జంక్షన్ దశ, దిశను మార్చేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఫ్లైఓవర్లు, స్కైవేలు, అండర్పా్సల నిర్మాణం చేపట్టగా తొలిసారిగా శివారు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఫై ఓవర్ రానుందని ఓ అధికారి తెలిపారు.
అభివృద్ధితోపాటు..
నగర శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దాంతో పాటు సమస్యలూ పెరుగుతున్నాయి. ట్రాఫిక్ (Traffic) రద్దీ పెరుగుతోంది. బాచుపల్లి జంక్షన్లో కూడా వాహనాల రద్దీ అమాంతం పెరిగింది. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రం అయ్యాయి. ఉదయం, సాయంత్రం వేళలో ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఫ్లై ఓవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చింది. బాచుపల్లి జంక్షన్లో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే మియాపూర్, దుండిగల్ మధ్య ఎలాంటి సిగ్నళ్లూ లేకుండా వాహనాలు రాకపోకలు సాగించవచ్చు. అదేవిధంగా నిజాంపేట నుంచి మల్లంపేట వైపు, ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కేందుకు అనువుగా ఉండనుంది. దాంతో పాటు రోడ్ల విస్తరణ చేపట్టడం వల్ల రవాణా మార్గాలు మెరుగుపడనున్నాయి. టెండర్లు (Tenders) పూర్తవ్వగానే సాధ్యమైనంత త్వరగా ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేస్తామని ఓ అధికారి తెలిపారు.