పంజాబ్ కాంగ్రెస్‌లో మరో దుమారం

ABN , First Publish Date - 2021-11-18T20:33:53+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్‌ నేతల మధ్య భేదాభిప్రాయాలు మరోసారి

పంజాబ్ కాంగ్రెస్‌లో మరో దుమారం

చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్‌ నేతల మధ్య భేదాభిప్రాయాలు మరోసారి బయటపడ్డాయి. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ సందర్శనకు వెళ్తున్న బృందంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకు స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని ఈ బృందం గురువారం కర్తార్‌పూర్‌లోని గురు నానక్ గురుద్వారాను సందర్శిస్తుంది. ఈ బృందంలో పంజాబ్ కేబినెట్ మంత్రులు ఉన్నారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఈ బృందంలో ఉండవచ్చునని తెలుస్తోంది. 


సిద్ధూ ఈ నెల 20న కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శిస్తారని ఆయన మీడియా సలహాదారు సురేంద్ర దలాల్ తెలిపారు.  ‘‘పంజాబ్ ప్రభుత్వానికి అన్ని పత్రాలను నిన్న (బుధవారం) సమర్పించాం. కేబినెట్‌తోపాటు ఆయన ఈరోజు (గురువారం) కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించవలసి ఉంది. మొత్తం కేబినెట్ ఈరోజు (గురువారం) వెళ్తుండగా, ఆయన నవంబరు 20న వెళ్ళవచ్చునని పంజాబ్ ప్రభుత్వం ఆయనకు ఎందుకు చెప్పిందో తెలియడం లేదు’’ అని చెప్పారు. 


గురు నానక్ జయంతి ఉత్సవాలు నవంబరు 19న జరుగుతాయని, సిద్ధూను వదిలేయడానికి కారణమేమిటని ప్రశ్నించారు. దీనికి సమాధానం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పగలదన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి సమస్య లేదన్నారు. పొరపాటు జరిగిందంటే అది పంజాబ్ ప్రభుత్వం వల్లే జరిగినట్లు కనిపిస్తోందని చెప్పారు. 


కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబరు 17 నుంచి తెరవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో దీనిని మూసేసిన సంగతి తెలిసిందే. సిక్కులు ఈ మార్గంలో ప్రయాణించి పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను సందర్శిస్తారు.  బీజేపీ ప్రతినిధుల బృందం కూడా ఈ చారిత్రక గురుద్వారాను గురువారం సందర్శిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవారం వెళ్లబోతోంది. 


గురు నానక్ జయంతినే గురు నానక్ గురు పరబ్ అని కూడా అంటారు. ఈ ఉత్సవాలు కార్తిక పౌర్ణమినాడు జరుగుతాయి.


Updated Date - 2021-11-18T20:33:53+05:30 IST