మరో రెండు ప్రాజెక్ట్లు పూర్తి.. రేపు ప్రారంభించనున్న KTR.. ఇక సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం
ABN , First Publish Date - 2022-03-15T18:04:11+05:30 IST
మరో రెండు ప్రాజెక్ట్లు పూర్తి.. రేపు ప్రారంభించనున్న KTR.. ఇక సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం..
- ఎస్ఆర్డీపీలో కొత్త ప్రాజెక్టులు
- రేపు ప్రారంభించనున్న కేటీఆర్
- ఎల్బీనగర్ చౌరస్తాలో కుడి వైపు అండర్పాస్
- బైరామల్గూడ జంక్షన్లో ఎడమ వైపు వంతెన
- రూ.6 వేల కోట్లతో పలు దశలుగా పనులు
హైదరాబాద్ సిటీ : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్డీపీ)లో మరో రెండు ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఎల్బీనగర్లో పూర్తయిన పనులతో ఆ జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. ఎల్బీనగర్ చౌరస్తాలో రూ.9.28 కోట్లతో కుడి వైపు నిర్మించిన అండర్పాస్, బైరామల్గౌడ జంక్షన్లో రూ.28.64 కోట్లతో నిర్మించిన ఎడమ వైపు వంతెనను మంత్రి కె. తారక రామారావు రేపు ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా ఎల్బీనగర్లో రూ.440 కోట్లతో వంతెనలు, అండర్పాస్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఇప్పటికే కామినేని వద్ద రెండు వంతెనలు, ఎల్బీనగర్ చౌరస్తాలో వంతెన, ఎడమ వైపు అండర్పాస్, చింతల్ కుంట అండర్పాస్, బైరామల్గూడ చౌరస్తాలో కుడి వైపు వంతెనలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం ఓ వంతెన, అండర్పాస్ ప్రారంభోత్సవం జరగనుండడంతో ఆ రెండు జంక్షన్లలో సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణానికి వీలు కలగనుంది. నాగోల్ నుంచి బైరామల్ గూడ, సాగర్ రోడ్, శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లే వారు సాఫీగా సాగిపోవచ్చు. బైరామల్గూడలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి వచ్చే వారూ ఆగకుండా రాకపోకలు సాగించే వెసులుబాటు కలగనుంది. రూ.29 వేల కోట్లతో ప్రతిపాదించిన ఎస్ఆర్డీపీలో పలు దశలుగా రూ.6 వేల కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో ఇప్పటికే 14 వంతెనలు, నాలుగు అండర్పాస్లు అందుబాటులోకి వచ్చాయి. ఆర్యూబీ, ఆర్ఓబీలూ పలు ప్రాంతాల్లో ప్రారంభించారు.