కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే.. మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

ABN , First Publish Date - 2021-12-24T00:54:34+05:30 IST

కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే కర్ణాటక అసెంబ్లీ గురువారం మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది...

కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే.. మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

బెంగళూరు:  కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే కర్ణాటక అసెంబ్లీ గురువారం మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది. సామూహిక మతమార్పిడులకు పాల్పడే వారికి ఇకపై జైలు శిక్ష విధించే నిబంధనను ఇందులో పొందుపరిచారు. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లారు. కాగా, ఈ బిల్లును కాంగ్రెస్‌తో పాటు క్రైస్తవ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. 


సభలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఈ బిల్లును ఆరెస్సెస్ అజెండాగా అభివర్ణించారు. స్పందించిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఇది దేశ 'సంస్కృతి'ని కాపాడటానికి తీసుకొచ్చిన బిల్లు తిప్పి కొట్టారు. కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లు- 2021.. ప్రలోభాలకు గురిచేయడం ద్వారా కానీ, బలవంతంగా కానీ, మోసపూరిత విధానాల ద్వారా కానీ, సామూహికంగా కానీ మతమార్పిడులను నిరోధిస్తుంది. 


దీనిని ఉల్లంఘించి ఎవరైనా మతమార్పిడులకు ప్రయత్నిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తారు. మైనర్లు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష రూ. 50 వేలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. అంతేకాదు, నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేస్తారు. 

Updated Date - 2021-12-24T00:54:34+05:30 IST