Cattle Smuggling: అనుబ్రత మోండల్ సీబీఐ కస్టడీ మరో నాలుగు రోజులు పొడిగింపు
ABN , First Publish Date - 2022-08-20T21:48:21+05:30 IST
పశువుల స్మగ్లింగ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ నేత అనుబ్రత మోండల్ సీబీఐ...
కోల్కతా: పశువుల స్మగ్లింగ్ కుంభకోణం (Cattle smuggling scam)లో తృణమూల్ కాంగ్రెస్ నేత అనుబ్రత మోండల్ (Anubrata Mondal) సీబీఐ కస్టడీని (CBI custody) మరో 4 రోజులు పొడిగించారు. ఈ శనివారంతో ఆయన సీబీఐ కస్టడీ ముగియనుండటంతో అసాంసోల్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ఆయనను హాజరు పరచారు. టీఎంసీ నేత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని మోండల్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనతో దర్యాప్తు సంస్థ విభేదించింది. మోండల్ చాలా శక్తివంతమైన వ్యక్తి అని, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే ప్రస్తుతం తాము చేస్తున్న దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సీబీఐ వాదించింది.
అనుబ్రత మోండల్ను ఆగస్టు 12 ఆయన నివాసం వద్ద సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. శనివారం కూడా కోల్కతాలో ఆయనకు చెందిన ఒక రైస్ మిల్లుపై దాడులు జరిపింది. మిల్లు ఆవరణలో అత్యంత ఖరీదైన పలు వాహనాలు పార్కింగ్ చేసి ఉండటం అధికారులు గుర్తించారు. కాగా, ఇదే కేసులో జైలులో ఉన్న అనుబ్రత మోండల్ బాడీగార్డ్ సైగల్ హొస్సేన్... పశువుల స్మగ్లర్ ఇమాన్యూయెల్ హఖ్కు, మోండల్కు మధ్యవర్తిగా వ్యవహరించినట్టు సీబీఐ చెబుతోంది. 2020లో పశువుల స్మగ్లింగ్ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మోండల్ పేరు బయటకు వచ్చింది. 2015-2017 మధ్య సరిహద్దుల గుండా స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న 20,000కు పైగా పశువులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సీజ్ చేసినట్టు సీబీఐ చెబుతోంది.