సచివాలయం ఎదుట నిరాహార దీక్ష ప్రారంభించిన అనుపమ

ABN , First Publish Date - 2021-10-23T23:36:48+05:30 IST

తన నుంచి అక్రమంగా వేరు చేసిన నవజాత శిశువును తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఫెడరేషన్

సచివాలయం ఎదుట నిరాహార దీక్ష ప్రారంభించిన అనుపమ

తిరువనంతపురం: తన నుంచి అక్రమంగా వేరు చేసిన నవజాత శిశువును తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) మాజీ నాయకురాలు అనుపమ ఎస్ చంద్రన్ నేడు (శనివారం) సచివాలయం ఎదుట నేడు నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షలో ఆమె భర్త అజిత్ కూడా కూర్చున్నారు. 


సీపీఎం యూత్ వింగ్ డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) మాజీ నేత, ఇప్పటికే వివాహమై విడాకులు తీసుకున్న అజిత్‌తో అనుపమ సంబంధాన్ని ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో గత అక్టోబరులో అనుపమ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, వీరి సంబంధాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న అనుపమ తల్లిదండ్రులు పుట్టిన బిడ్డను తీసుకెళ్లి శిశు సంరక్షణ కేంద్రంలో దత్తతకు ఇచ్చినట్టు అనుపమ ఆరోపిస్తున్నారు. 


దీక్షకు కూర్చుకోవడానికి ముందు అనుపమ మాట్లాడుతూ.. పోలీసులపై విశ్వాసం కోల్పోయానని, ఇక తనకు సాయం చేయాల్సింది ప్రభుత్వమేనని అన్నారు. అనుపమకు అండగా ఉంటామన్న సీపీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ తనకు బాగా అవసరమైన సమయంలో ఆ పార్టీ నుంచి తనకు కావాల్సిన సాయం అందలేని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని, అనుపమ చట్టపరంగా ముందుకెళ్లాలని గతంలో చెప్పిన సీపీఎం తాత్కాలిక కార్యదర్శి ఎ.విజయరాఘవన్ తాజాగా అనుమప దీక్షకు కూర్చోవడానికి ముందు మద్దతు ప్రకటించారు. మరోవైపు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మాట్లాడుతూ.. అనుపమకు న్యాయం కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె బిడ్డను తిరిగి చెంతకు చేర్చాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-23T23:36:48+05:30 IST