తూకంలో మోసం చేస్తున్నారంటూ ఆందోళన
ABN , First Publish Date - 2021-11-28T05:26:13+05:30 IST
మండలంలోని ఖమ్మంపల్లి గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం చేస్తున్నారని రైతులు శనివారం ఆందోళనకు దిగారు.
కొండపాక, నవంబరు 27: మండలంలోని ఖమ్మంపల్లి గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం చేస్తున్నారని రైతులు శనివారం ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యం లారీని మరోచోట తూకం వేస్తే సుమారు 6 క్వింటాళ్ల తేడా వచ్చిందని, ఈ విషయం గ్రామ సర్పంచ్ భర్త మల్లేశం శనివారం ఉదయం రైతులకు తెలుపగా, రైతులంతా కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని అధికారులను నిర్వాహకులను నిలదీశారు. దీంతో సిబ్బందికి, రైతులకు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడ ఉన్న తూకం యంత్రాన్ని పరిశీలించగా ఎలాంటి తేడా కనబడలేదు. విషయం తెలుసుకున్న ఐకేపీ డీపీఎం కరుణాకర్, ఏపీఎం శ్రీనివాస్లు చేరుకొని ఖమ్మంపల్లి నుంచి కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లను వివరణ కోరగా ఒక లారీకి కేవలం అరవై నాలుగు కిలోలు ఎక్కువ వచ్చాయని తెలిపారు. లారీ మొత్తంలో 64 కిలోలు రావడం పెద్ద తేడా కాదని తెలపడంతో రైతులు శాంతించారు. రైౖతులతో అధికారులు అన్ని విషయాలు చెప్పి శాంతింపజేశారు. ఎలాంటి మోసం లేకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు యాదగిరి నిర్వాహకులకు సూచించారు.