నేతల్లో సయోధ్య ఏదీ?

ABN , First Publish Date - 2021-10-27T09:09:18+05:30 IST

క్రమశిక్షణ, ఐక్యత తక్షణావసరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులతో భేటీలో సోనియా.....

నేతల్లో సయోధ్య ఏదీ?

క్రమశిక్షణ, ఐక్యత తక్షణావసరం

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, 

పీసీసీ అధ్యక్షులతో భేటీలో సోనియా

న్యూఢిల్లీ, అక్టోబరు 26: విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి పార్టీ నేతల్లో సయోధ్య, స్పష్టత రెండూ కొరవడ్డాయని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుబట్టారు. వ్యక్తిగత ఆకాంక్షలను పక్కనపెట్టి పార్టీని బలోపేతం చేయాలని సీనియర్‌ నేతలకు హితవు చెప్పారు. సమష్టి, వ్యక్తిగత విజయాల సాధనకు క్రమశిక్షణ, ఐక్యత తక్షణావసరమని స్పష్టంచేశారు. కీలక అంశాలపై అధిష్ఠానం పంపే సందేశాలు క్షేత్రస్థాయి కార్యకర్తలకు చేరడం లేదని ఆక్షేపించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఖరారుకు ఆమె మంగళవారమిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు, రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు హాజరయ్యారు. బీజేపీ/సంఘ్‌ అబద్ధాలను బట్టబయలు చేయాలని పిలుపిచ్చారు. మోదీ ప్రభుత్వంపై సోనియా ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. వ్యవస్థల విధ్వంసానికి మోదీ ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య మూలసూత్రాలను ప్రశ్నిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వ అణచివేత బాధితులైన రైతులు, రైతు కూలీలు, ఉపాధి కోసం పోరాడే యువత, చిన్న పరిశ్రమల తరఫున పోరాటాన్ని ద్విగుణీకృతం చేయాలని పిలుపిచ్చారు. కాగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. నవంబరు 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు విస్తృత స్థాయిలో ఈ కార్యక్రమం ఉంటుందని ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా మీడియాకు తెలిపారు.

Updated Date - 2021-10-27T09:09:18+05:30 IST