AP Assembly పరిసరాల్లో ఉద్రిక్తత.. టీడీపీ ఎడ్లబళ్లను ఎత్తుకెళ్లిన పోలీసులు

ABN , First Publish Date - 2022-09-19T14:53:04+05:30 IST

అసెంబ్లీ పరిసరాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

AP Assembly పరిసరాల్లో ఉద్రిక్తత.. టీడీపీ ఎడ్లబళ్లను ఎత్తుకెళ్లిన పోలీసులు

అమరావతి: అసెంబ్లీ పరిసరాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతు సమస్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం శాసనసభ పక్షం నిరసన చేపట్టనుంది. అయితే తెలుగుదేశం శాసనసభ పక్షం నిరసన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎడ్లబళ్లను పోలీసులు ఎత్తుకెళ్లారు. వెంటనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు(TDP MLA, MLCs) తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు.  పోలీస్ స్టేషన్ నుంచి ఎడ్ల బళ్లను తోసుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. ఎడ్లకు బదులు ఎమ్మెల్యేలే కాడ తగిలించుకుని బండిని లాగారు. ఎడ్ల బళ్లపై పోలీసు ప్రతాపం ఏమిటంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తెదేపా శాసనసభ పక్షఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla buchaiah chowdary) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న కోటరీ వల్లే రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. మూడేళ్లుగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తెలిపారు. మూగజీవాల్ని పోలీసులు తరమటం దుర్మార్గమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


పోలీసులతో లోకేష్ వాగ్వాదం

ఎడ్లను పోలీసులు తీసుకెళ్లడంపై పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. ఎడ్లబండి కాడె మోస్తూ అసెంబ్లీకి లోకేష్, అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, ఇతర ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసు వలయాన్ని తోసుకుంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ ఎడ్ల బండిని నేతలు లాక్కుంటూ వెళ్లారు.


ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... తెలుగుదేశం నిరసనకు ఎడ్ల బండి ఇచ్చిన రైతును సీఐ తీవ్రంగా కొట్టారన్నారు. రైతుపై చెయ్యి చేసుకున్న పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతును కొట్టిన అంశంపై అసెంబ్లీలోనూ నిరసన తెలుపుతామన్నారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యల వల్లే  పంట విరామం ప్రకటించాల్సి వచ్చిందని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు (Nimmala ramanaidu) మండిపడ్డారు. 


Updated Date - 2022-09-19T14:53:04+05:30 IST