నిండు సభలో Chandrababuకు ఘోర అవమానం
ABN , First Publish Date - 2021-11-19T18:12:24+05:30 IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఘోర అవమానం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలతో టీడీపీ సభ్యులను అవమానిస్తూ మాట్లాడారు. ఆఖరికి చంద్రబాబు కుటుంబంలోని మహిళలపై కూడా వైసీపీ ఎమ్మెల్యేలు నోరుపారేసుకున్నారు. దీంతో చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెంది కంటతడి పెట్టారు.
అసలేం జరిగింది..!?
వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ‘ఇన్నేళ్లూ ఎన్నో అవమానాలు పడ్డాను. నా భార్య, నా కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నా భార్యను అవమానించేలా మాట్లాడారు. నా కుటుంబ సభ్యులను కూడా రోడ్డుపైకి లాగారు. ఎప్పుడూ లేని అవమానాలు భరించాను. సభలో ఎన్నో చర్చలు చూశాం కానీ.. ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కోలేదు’ అని తీవ్ర భావోద్వేగంతో చంద్రబాబు మాట్లాడారు. అయితే.. బాబు మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో సభ నుంచి మాజీ ముఖ్యమంత్రి వెళ్లిపోయారు. ఆయన వెంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బయటికొచ్చేశారు. ఇదంతా జరుగుతున్నప్పుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అవహేళనగా నవ్వుతూ ఉండటం గమనార్హం.