TDP concern: స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నినాదాలు...ఏపీ అసెంబ్లీలో గందరగోళం
ABN , First Publish Date - 2022-09-15T15:18:10+05:30 IST
మొదటి రోజే ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జాబ్క్యాలెండర్... జాబ్లెస్ క్యాలెండర్ అంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో గొడవ మొదలైంది.
అమరావతి: మొదటి రోజే ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో గందరగోళ పరిస్థితి నెలకొంది. జాబ్క్యాలెండర్... జాబ్లెస్ క్యాలెండర్ అంటూ టీడీపీ (TDP) ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ (Speaker tammineni sitaram) తిరస్కరించడంతో గొడవ మొదలైంది. వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం దగ్గర దూసుకెళ్లి టీడీపీ సభ్యులు (TDp MLAs) ఆందోళన చేపట్టారు. జాబ్ ఎక్కడ జగన్ (AP CM) అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్ (Jagan mohan reddy) డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్గా మారిందని టీడీపీ నినాదాలు చేసింది. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాన్ని చేపడతామని స్పీకర్ (AP Assembly speaker) చెప్పినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ వెల్లోకి వెళ్లి నినాదాలు చేశారు.
బుగ్గన ఆగ్రహం...
టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యుల ప్రశ్నలే ఉన్నాయన్నారు. ప్లకార్డులతో సభలోకి రావడం సరికాదని అన్నారు. టీడీపీ సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారని మంత్రి బుగ్గన (AP Minister) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.